రాజధాని వికేంద్రీకరణ ఒకరకంగా రెండు పార్టీలకు ఇబ్బందులు తెచ్చిపెట్టింది. విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్రాంతంలో టీడీపీ నాయకులకు, కృష్ణా, గుంటూరు ప్రాంత నాయకులకు రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెట్టింది. ఇందకు పరిష్కారం ఏంటో.. పార్టీల అభిప్రాయమేంటో తెలియక అయోమయంగా ఉన్నారు.
విశాఖలో టీడీపీ ఎమ్మెల్యేల పరిస్థితేంటో.. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని టీడీపీ ఎమ్మెల్యేల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. రాజధానిగా విశాఖను ఉత్తరాంధ్ర ప్రజలు స్వాగతిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని టీడీపీ అధినేత వ్యతిరేకించడంతో అక్కడి నాయకులు ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. సీనియర్ నాయకులు గంటా, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, వాసుపల్లి గణేశ్.. ఇలా వీరంతా టీడీపీకి చెందిన ప్రముఖులు. వీరు కూడా ఏమీ సమాధానం చెప్పుకోలేని పరిస్థితిల్లో ఉన్నారు. అధినేత మాటకు అడ్డు చెప్పకూడదు.. స్థానిక ప్రజలకు వ్యతిరేకంగానూ ఉండకూడదు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో నాయకులు ఉండిపోయారు.
కృష్ణా, గుంటూరు జిల్లా వైసీపీ నాయకులకు గడ్డు కాలమే.. : ఈ రెండు జిల్లాల్లో కూడా గత ఎన్నికల్లో ప్రజలకు వైసీపీకి అత్యధిక సీట్లు కట్టబెట్టారు. 29 మంది ఎమ్మెల్యేలు ఈ రెండు జిల్లాల్లో ఉన్నారు. వీరికి కూడా ఇదే పరిస్థితి నెలకొంది. రాజధాని అమరావతిపై ఇక్కడ భావోద్వేగాలు నెలకొన్న పరిస్థితి. పార్టీ అధినేత, సీఎం నిర్ణయానికి వీరంతా విధేయులై ఉండాల్సిందే. విశాఖ రాజధానిని వీరంతా ఏకీభవిస్తున్నారు. కానీ.. రెండు జిల్లాల్లో పరిస్థితులు వైసీపీ నాయకులకు అంతుబట్టని పరిస్థితి. ఈ నేపథ్యంలో వీరి రాజకీయ భవిష్యత్తును ప్రజలు నిర్ణయిస్తారో.. పార్టీ నిర్ణయిస్తుందో కాలమే సమాధానం చెప్పాలి.