అధికారంలో ఉన్న వైసిపిలో యువత గుభాళి స్తుంటే ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి ముసలి వాసన కొడుతోందని రాజకీయ పండితులు భావిస్తున్నారు.
వైసీపీ బలోపేతం కావడానికి టిడిపి రోజురోజుకీ బలహీన పడటానికి కారణం ఇదేనని కూడా వారు విశ్లేషిస్తున్నారు. వైసీపీ విషయానికొస్తే ముఖ్యమంత్రి జగన్ కే యాభై ఏళ్లు లేవు. ఇక ఆ పార్టీ ఎమ్మెల్యేలలో మెజారిటీ శాసనసభ్యులు కుర్రోళ్ళు. మొత్తంమీద చూస్తే వైసీపీ లో యంగ్ బాచి అధికం. టిడిపి లో చూస్తే పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి డెబ్బై ఏళ్లు దాటాయి.పత్రికా పార్టీలో కీలక పాత్ర పోషించే యనమల రామకృష్ణుడు, వర్ల రామయ్య ,గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులంతా కూడా వయోధికులే.
చిన్న బాబు లోకేష్ కుర్రాడే.. కాదనలేం.. కానీ అతనికి వైసీపీని తట్టుకునే శక్తి సామర్థ్యాలు లేవని ఎప్పుడో రుజువు అయిపోయింది. ఈ పరిస్థితుల్లో టిడిపి ఎలా మనుగడ సాగిస్తుందా అన్నది ప్రశ్నార్థకం. యువతను టిడిపిలో యాక్టివ్ చేస్తే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది అన్నది రాజకీయ పరిశీలకులు సూచన. నిజానికి ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లో ఉన్న టిడిపి సీనియర్ నాయకులు చాలామంది తమ వారసులను రాజకీయ రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకదశలో లోకేష్ బాబు కూడా పార్టీ లో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఇందుకోసం చంద్రబాబు నాయుడు లోకేష్ కలిసి పార్టీలోని యువ నాయకులకు ఒక విందు కూడా ఇచ్చారు.
ఈ విందుకు పెద్ద సంఖ్యలో టిడిపి యువ నాయకులు కుటుంబ సమేతంగా హాజరై చంద్రబాబు లోకేష్తో కలిసి సెల్ఫీలు కూడా తీసుకున్నారు.దీంతో పార్టీని గట్టున పడేసే ప్రయత్నాలు మొదలయ్యాయని పరిశీలకులు భావించారు.అయితే అంతటితోనే ఆ ప్రక్రియ ఆగిపోయింది. మళ్లీ లోకేష్ నుంచి ఏ మాట మంతీ లేకపోవడంతో టిడిపి యువ నేతలు సైలెంట్ అయిపోయారు. ఈ లోపు వైసీపీ ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించింది. టిడిపి మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర ,మాజీ ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్ రెడ్డి చింతమనేని ప్రభాకర్ తదితరులను వేరే వేరే కేసుల్లో జైలుకు సైతం పంపింది.దీంతో టిడిపి యువనాయకులు మరీ భయపడిపోయారు.
పెద్ద పెద్ద నాయకులకే దిక్కులేదు …మనకెందుకు అన్నట్లు వారు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. పైగా జగన్ ప్రభుత్వంపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే కూడా తీవ్ర స్థాయిలో రియాక్షన్ వుంటోంది.ఇలాంటి పోస్టులు పెట్టారన్న అభియోగంపై చాలామంది టిడిపి సోషల్ మీడియా కార్యకర్తలను కూడా జగన్ ప్రభుత్వం అరెస్టు చేయించింది.ఇది కూడా టిడిపి యువనాయకులకి భయాన్ని కలిగించింది.ఈ నేపథ్యంలో టిడిపిలోని కుర్రోళ్లు ఇళ్లకు పరిమితమయ్యారు.వృద్ధ నాయకులే జగన్ ప్రభుత్వానికి ఎదురీదుతున్నారు.ఈ పరిస్థితిని కనుక సరిదిద్దకపోతే 2024 ఎన్నికల నాటికే టిడిపి దుకాణం కట్టేసుకోవాల్సివస్తుందని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.