ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సామాన్యుడు కాదు..అసమాన్యుడు. ఎందుకు అనాల్సి వస్తుందంటే…నాడు కాంగ్రెస్ పార్టీలో ఎంపిగా ఉన్న సమయంలో ఓదార్పు యాత్ర సంకల్పిస్తే కాంగ్రెస్ నాయకత్వం వద్దని వారించింది. అయినా తాను ఒక సారి నిర్ణయించుకున్న తరువాత వెనక్కు తగ్గేది లేదని మొండి పట్టుదలతోనే ముందుకు సాగాారు జగన్. నాడు ఇడి, సిబిఐ దాడులు నిర్వహించి ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసినా వెనక్కు తగ్గలేదు జగన్. తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణానంతరం గుండె ఆగిన వైఎస్ అభిమానుల కుటుంబ సభ్యుల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. పార్టీ స్థాపించిన తరువాత తొలి ప్రయత్నంలో అధికారం రాకపోయినా, గెలిచిన ఎమ్మెల్యేలలో కొందరు నాటి అధికార పార్టీ టిడిపిలోకి వెళ్లిపోయినా పార్టీ ఏమవుతుందోనని ఆందోళన చెందలేదు జగన్. మొక్కవోలిన విశ్వాసంతో ఒక పక్క కోర్టు వాయిదాలకు అటెండ్ అవుతూనే మరో పక్క రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా చైతన్య పాదయాత్రను జగన్ నిర్వహించారు. ఏ రాజకీయ పార్టీతో పొత్తు అనే ప్రశక్తే లేకుండా పార్టీ స్థాపించిన రెండవ ప్రయత్నంలో ఊహించని విజయం సాధించటంలో జగన్ కార్యదీక్ష, పట్టుదల, మొండితనమే నిదర్శనం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే.. జగన్మోహన రెడ్డి సంకల్పించిన మూడు రాజధానుల అంశంపైనా అదే పట్టుదలతో ఉన్నారు. అడుగడుగునా అవాంతరాలు, అడ్డంకులు ఎదురు అవుతున్నా జగన్ తన ప్లాన్ ప్రకారం వ్యూహత్మకంగా చాపకింద నీరుగా పనులను చక్కబెట్టే పనిలో ఉన్నట్లు కనబడుతోంది.
జగన్మోహనరెడ్డి స్వభావంపై మాజీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు పలు సందర్భాలలో జగమొండి జగన్ ఆయన పేరులోనే సగం ఉంది అంటూ విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. చంద్రబాబు అన్నట్లుగా ఆ మొండి తనం ఏమైనా చూపిస్తున్నారో ఏమో కానీ…తాను తీసుకున్న నిర్ణయాలకు ప్రతిపక్షాల నుండి విమర్శలు ఎదురైనా, కోర్టుల నుండి అక్షింతలు పడుతున్నా వెనుకడుగు వేయకుండా చాపకింద నీరుగా తన పని తాను చేసుకుపోతున్నారు జగన్. ఇందుకు పరిపాలనా రాజధానిగా పేర్కొంటున్న విశాఖలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి 30 ఎకరాలను కేటాయిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం నిదర్శనం కావచ్చు.
ఒక పక్క మూడు రాజధానుల అంశానికి హైకోర్టులో స్టేటస్ కో ఉత్తర్వులు ఉన్న సమయంలోనే విశాఖ పట్నం సమీపంలోని భీమునిపట్నం మండలంలో గల గ్రైహాండ్స్ స్థలం 300 ఎకరాల్లో 30 ఎకరాల భూమిని విశాఖ జిల్లా కలెక్టర్ పేరుపై స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణానికి బదిలీ చేయాలని అదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. రాజధాని తరలింపునకు సిఎం జగన్ చర్యలు ప్రారంభించారనీ, చాపకింద నీరులా రాజధాని తరలింపు ప్రక్రియ మొదలు అయినట్లేనని రాజకీయ వర్గాల నుండి వినిపిస్తున్నది. మూడు రాజధానుల అంశంపై కోర్టు విచారణతో తీవ్ర జాప్యం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జగన్ చాపకింద నీరుగా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారని తెలుస్తుంది. రాజధాని వివాదంపై రాష్ట్ర హైకోర్టులో సెప్టెంబర్ 21 నుండి రోజు వాిర విచారణ జరిగే అవకాశం ఉన్నప్పటికీ..వివాదం అంతటితో ఆగిపోదనీ, ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తే పిటీషనర్లు, పిటీషనర్ లకు అనుకూలంగా తీర్పు వస్తే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం గడప తొక్కే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముందుగానే విశాఖలో అవసరమైన భవనాలను నిర్మిస్తే హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే అక్కడి నుండి కార్యకలాపాలు సాగించవచ్చని భావిస్తున్నారని అంటున్నారు. అయితే ఈ గెస్ట్ హోస్ నిర్మాణానికి స్థలం కేటాయింపు విషయం కూడా హైకోర్టుకు చేరడంతో దీనిపై వచ్చే నెల 10వ తేదీలోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు నోటీసు జారీ చేసింది.
రాజధాని తరలింపునకు జగన్ సర్కార్ చాపకింద నీరులా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా వాటిని అడ్డుకునే క్రమంలో ప్రత్యర్థులు కోర్టులను ఆశ్రయిస్తూ అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. రాజధాని అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని, తమకు సంబంధం లేదని ఒకటి రెండు సార్లు కోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయడం జగన్మోహనరెడ్డి సర్కార్ కు ఊరట నిస్తుండగా ఈ వ్యవహారం సర్వాత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.