రెండు వారాల క్రితం ప్రారంభమైన బిగ్ బాస్ షో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. గత సీజన్లతో పోలిస్తే ముక్కూమొహం తెలియని కంటెస్టెంట్లు ఎక్కువగా ఉన్నాయని, టాస్క్ లు రిపీట్ అవుతున్నాయని పలు విమర్శలు వచ్చినా బిగ్ బాస్ షోపై ప్రేక్షకులు బాగానే ఆసక్తి చూపిస్తున్నారు. అయితే వీకెండ్ లో బిగ్ బాస్ షోకు అదిరిపోయే రేటింగ్స్ వస్తుంటే వీక్ డేస్ లో మాత్రం తక్కువ రేటింగ్ తో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.
మరోవైపు వైల్డ్ కార్డ్ ఎంట్రీలలో కుమార్ సాయి ఫ్లాప్ కాగా అవినాష్ పరవాలేదనిపిస్తున్నాడు. దీంతో బిగ్ బాస్ హౌస్ లో మరో హాట్ హీరోయిన్ ఎంట్రీ ఇవ్వబోతుందని ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్ వల్ల రేటింగులు తగ్గే ప్రమాదం ఉందని భావించిన బిగ్ బాస్ నిర్వాహకులు ముందస్తు చర్యల్లో భాగంగా స్వాతి దీక్షిత్ ను రంగంలోకి దింపుతున్నారు. అల్లరి నరేష్ నటించిన జంప్ జిలానీ సినిమాలో స్వాతి దీక్షిత్ హీరోయిన్ గా నటించింది.
మొదట బిగ్ బాస్ కంటెస్టెంట్ల పేర్లు లీక్ అయిన సమయంలో స్వాతి దీక్షిత్ పేరు వినిపించినా తుది జాబితాలో ఆమె పేరు లేకపోవడంతో చాలామంది ఆమె ఈ షోకు రాదని భావించారు. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ కోసమే స్వాతి దీక్షిత్ ను బిగ్ బాస్ నిర్వాహకులు ఆలస్యంగా రంగంలోకి దింపుతున్నారు. ఆమె గ్లామర్ షోకు ప్లస్ అవుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఐపీఎల్ను ఢీ కొట్టేందుకు బిగ్ బాస్ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం ఏ మేరకు ఫలితాన్నిస్తుందో చూడాలి.
తెలుస్తున్న సమాచారం మేరకు ఈ వీకెండ్ లో స్వాతి దీక్షిత్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. తొలి ఎపిసోడ్ తో గత బిగ్ బాస్ సీజన్ల రికార్డులను అధిగమించిన బిగ్ బాస్ 4 రేటింగులు తగ్గకుండా ఉండటం కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. మరోవైపు ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి కుమార్ సాయి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.