సబ్బం హరి…. విశాఖ రాజకీయాల్లోని ముఖ్య నేతల్లో ఒకరు. అయితే, తాజాగా ఆయన ఊహించని రీతిలో వివాదంలో చిక్కుకుంటున్నారు. ఈ వివాదం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మెడకు చుట్టాలని ప్రయత్నాలు జరిగాయి.
రాజకీయ విమర్శలు జరిగాయి. అయితే, దీనిపై వైసీపీ నేత, పర్యాటక శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు(అవంతి శ్రీనివాసరావు) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను, విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత సబ్బం హరి ఒక వీధి రౌడీ, ఆకు రౌడీలా మాట్లాడిన వ్యక్తిగత దూషణలను తీవ్రంగా ఖండిస్తున్నామని వ్యాఖ్యానించారు.
అసలు సబ్బం హరిని ఎవరు పట్టించుకుంటారు?
తన మీద పోటీ చేసి ఓడిపోయిన సబ్బం హరి గురించి ఎవరూ పట్టించుకోరని అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. “సబ్బం హరి గురించి పట్టించుకోవాల్సిన అవసం కూడా ఎవరికీ లేదు. ఆయన గురించి ఆయనే ఎక్కువగా ఊహించుకుని.. ఎక్కువ మాట్లాడుతున్నాడు. సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి ఎంపీగా పనిచేసిన వ్యక్తి.. ఈరోజు ఒక వీధి రౌడీలా మాట్లాడాడు, ఒక కార్పొరేటర్ స్థాయి వ్యక్తి కూడా అలాంటి భాష మాట్లాడడు. సబ్బం హరి మాట్లాడితే.. దానికి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, టీడీపీ నేతలు బండారు సత్యనారాయణ, అయ్యన్నపాత్రుడు.. వీళ్ళంతా ఆయనకు మద్దతుగా మాట్లాడటం, వాటిపై మీడియాలో ఇస్తున్న కవరేజ్ చూస్తే.. దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన గాంధీ గారి గురించి నిన్న గాంధీ జయంతి రోజున కూడా ఇవ్వని కవరేజ్ ఇస్తూ.. విశాఖలో, రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని ఓ వర్గం మీడియాలో రాద్ధాంతం చేస్తున్నారు.“ అంటూ మండిపడుతున్నారు.
ఆకు రౌడీవా… వీది రౌడివా?
వళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సబ్బం హరిని హెచ్చరిస్తున్నామని అవంతి శ్రీనివాస్ అన్నారు. “మీరు ఏమన్నా ఆకు రౌడీ, వీధి రౌడీ అనుకుంటున్నారా.. రాజకీయాల్లో ఉంటే.. సహేతుకమైన విమర్శలు చేయాలి. నోరు ఉందని అడ్డగోలుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోం. సబ్బం హరికి చెందిన ఒక్క ఆక్రమణను మాత్రమే కొట్టేయలేదే..?. విశాఖ నగరంలో మొత్తం 450 మందివి కొట్టేసినప్పుడు నోరు మెదపకుండా.. మీ దగ్గరకు వచ్చే సరికి రోడ్డు మీదకు వచ్చి పులివేషాలు వేస్తే చూస్తూ ఎవరూ ఊరుకోరు. “ అని ప్రశ్నించారు. “ఈ ప్రభుత్వానికి ఎవరిమీదా, ఏ విధమైన కక్ష సాధింపులు లేవు. సబ్బం హరి మీద కూడా ఎటువంటి కక్ష లేదు. అంతెందుకు, ఇటీవల మా పార్టీ నాయకుడి మీద భూ ఆక్రమణల ఆరోపణలు వస్తే పార్టీ సస్పెండ్ చేసింది.“ అని ఆయన స్పష్టం చేశారు.
అసలు జగన్ ప్రభుత్వానికి ఏం అవసరం?
తమ ప్రభుత్వానికి ఎలాంటి విధ్వంసం చేయాల్సిన అవసరం లేదని అవంతి శ్రీనివాస్ తెలిపారు. “భూ ఆక్రమణలు ఏమైనా ఉంటే.. వాటిని తొలగించాలని అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు. లా అందరికీ సమానమే. ఎవరూ అతీతం కాదు. రాజకీయ నాయకులు ఎక్కువ కాదు. ఎగ్జిక్యూటివ్ రాజధాని విశాఖను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం. కబ్జాలు, అక్రమ నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తాం. తన, మన అన్న తేడా లేదు. ఎవరికైనా ఒకటే న్యాయం. మీడియా కూడా విచక్షణ చూపాలి. సబ్బం హరి ఆక్రమణ విషయంలో.. తప్పు జరిగిందా.. లేదా అన్నది కూడా చూడాలి. ఆయన ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారా లేదా.. అన్నది చూడాలి. “ అని ప్రకటించారు. ఆక్రమణలు ముట్టుకుంటే కక్ష సాధింపని చంద్రబాబు, టీడీపీ నాయకులు మాట్లాడటం సిగ్గుచేటు అని అవంతి పేర్కొన్నారు.
ఆయనో ప్రపంచ మేధావి
పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజ్ మాట్లాడుతూ… “సబ్బం హరి టీవీ చర్చల్లోగానీ, మీడియా సమావేశాల్లోగానీ ఆయన మాట్లాడే విధానం చూస్తే.. ఆయనేదో ప్రపంచ మేధావి అన్నట్లు బిల్డప్ ఇస్తూ మాట్లాడతాడు. అసలైన వ్యక్తిత్వం ఎప్పుడు బయటపడుతుంటే.. తప్పు చేసి అడ్డంగా దొరికిపోయినప్పుడు, ఆ తప్పు నుంచి బయటపడేందుకు బుకాయించేటప్పుడు కనిపిస్తుంది. అదే ఈరోజు సబ్బం హరి మాటల్లో కనిపించింది“ అని వ్యాఖ్యానించారు.