రాజకీయాల్లో కొన్ని కొన్ని సార్లు… చిత్ర విచిత్ర ఘట్టాలు జరుగుతుంటాయి. అవి చూసే వారికి వింతగా, ఆశ్చర్యకరంగా ఉన్నా కూడా నాయకులు అలా చేసేస్తుంటారు అంతే!
ఇప్పుడు అదే వైసీపీ, టీడీపీ విషయంలో జరుగుతోంది. ఏపీలో అధికార – ప్రతిపక్ష పార్టీల విమర్శల పర్వంలో తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆయన్ను ఓ అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్తో పోల్చింది.
జగన్, ఆ డ్రగ్ మాఫియా కింగ్ ఒకటేనట
జగన్ .. ‘ ఆంధ్రా ఎస్కోబార్ ’ అని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. “ పాబ్లో ఎస్కోబార్ అనే డ్రగ్ మాఫియాకింగ్ 1985 లో కొలంబియాలోని సుప్రీంకోర్టుపై గెరిల్లాలతో దాడి చేయించి, 11 మంది న్యాయమూర్తులను పొట్టనపెట్టుకున్నాడు. అతన్ని స్ఫూర్తిగా తీసుకున్న మనీ లాండరింగ్ కింగ్, బ్లాక్ మనీ డాన్, ‘ఆంధ్రా ఎస్కోబార్’ అయిన జగన్ మోహన్ రెడ్డి, నేడు న్యాయవ్యవస్థపై, న్యాయమూర్తులపై దాడికి దిగాడు.“ అంటూ సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన తప్పులను కప్పిపుచ్చుకుంటూ, తన అవినీతికి మసిపూసి, సానుభూతి అనే తేనె పూసిన కత్తితో మరోసారి ప్రజల గొంతులుకోయాలని జగన్ నాటకాలు ఆడుతున్నారని విరుచుకుపడ్డారు.
హిట్లర్ , ముస్సోలిని, జగన్
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హిట్లర్, ముస్సోలినీ వంటి నియంతల జీవితచరిత్రల పుస్తకాలు చదువుతుంటాడని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే ఒరవడిలో కొలంబియాకు చెందిన డ్రగ్ మాఫియా కింగ్ అయిన పాబ్లో ఎస్కోబార్ జీవిత చరిత్ర కూడా చదివాడని పట్టాభి ఆరోపించారు. “పాబ్లో ఎస్కోబార్ 1985 నవంబర్లో, అమెరికా దేశం ఆయన్ని అరెస్ట్ చేసి, కొలంబియా సుప్రీంకోర్టులో ప్రవేశపెడితే, తన అనుచరులు, టెర్రరిస్ట్ లతో ఎస్కోబార్ కోర్టు పైనే దాడి చేయించి, 11మంది జడ్జీలను పొట్టన పెట్టుకున్నాడు. అదే విధంగా మనీలాండరింగ్ కింగ్, బ్లాక్ మనీ కింగ్ అయిన జగన్ మోహన్ రెడ్డి కూడా ఎస్కోబార్ మాదిరే న్యాయ వ్యవస్థపై, జడ్జీలపై దాడి చేస్తున్నాడు. ఎస్కోబార్ ఆనాడు సుప్రీం కోర్టుపై దాడి చేయించి, తనను తాను రక్షించుకోవడానికి ఎలాగైతే ప్రయత్నం చేశాడో, ఆంధ్రా ఎస్కోబార్ అయిన జగన్ మోహన్ రెడ్డి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై దాడికి దిగాడు“ అంటూ మండిపడ్డారు.
జగన్ కోసం స్కెచ్ వేసేది ఆయనే
ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై సైతం టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విరుచుకుపడ్డారు. “ సీఎం జగన్ మోహన్ రెడ్డిని కాపాడటం కోసం, జగన్ మోహన్ రెడ్డి పై న్యాయస్థానాలు దాడిచేస్తున్నాయనే దురభిప్రాయం ప్రజల్లో కలిగించి, వారిసానుభూతి పొందడంకోసం తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చొని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తన కుట్రలను అమలు చేస్తున్నాడు“ అంటూ విరుచుకుపడ్డారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుని, ఆయన కుమారుడు లోకేశ్ ను దూషించడం వైసీపీ నేతలు మానేయాలని కోరారు. వైసీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడితే వారికే మంచిదని పట్టాభి తీవ్ర స్వరంతో హెచ్చరించారు. కాగా, టీడీపీ నేత సంచలన, వివాదాస్పద కామెంట్లపై వైసీపీ ఎలా స్పందిస్తున్న ఆసక్తి నెలకొంది. కాగా, ఇప్పటికే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా డ్రగ్ స్మగ్లర్తో పోల్చడం టూమచ్ అని సోషల్ మీడియాలో పలువురు స్పందిస్తున్నారు.