మన భారత దేశంలో గురువులను “ఆచార్యదేవోభవ“ అంటూ పూజిస్తాం. పిల్లలు సరిగా చదవకపోయినా, స్కూల్ లో వారు ఏదయినా తప్పు చేసినా టీచర్లు వారిని కఠినంగా శిక్షిస్తుంటారు. అయితే మరి టీచర్ లే తప్పు చేస్తే, వారిని ఎవరు శిక్షిస్తారు? ఈ ప్రశ్నకు సమాధానం లేదనుకున్నారో ఏమో కానీ కొందరు టీచర్లు రోజూ స్కూలుకు లేటుగా రావడం మొదలు పెట్టారు. అయితే రానురాను వారు ఇదే అలవాటుగా చేసుకున్నారు. ఇది గమనించిన పిల్లల తల్లిదండ్రులు ఆ టీచర్ లకు చుక్కలు చూపించారు.
కరోనా నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో లాక్ డౌన్ విధించినందున స్కూల్లు మూసివేశారు. ఎనిమిది నెలల తరువాత ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ నుండి సడలింపులు ఇచ్చిన కారణంగా కొన్ని స్కూల్ లను తెరిచారు. స్కూల్ లు తెరిచినప్పటికీ అక్కడక్కడ కరోనా కేసులు విజృంభిస్తూ ఉండడంతో అవి కూడా సరిగ్గా జరగడం లేదు. ఇదిలా ఉండగా స్కూల్ లు తెరిచినప్పటికీ ఉపాధ్యాయులు స్కూలుకి ఆలస్యంగా రావడాన్ని పిల్లల తల్లితండ్రులు సహించలేకపోయారు.
ఇది గమనించిన విద్యార్థుల పేరెంట్స్ ఆ టీచర్స్ కి నిరసన తెలియజేయాలని నిర్ణయించుకుని హెచ్ ఎం గదికి తాళం వేసేశారు. ఏకంగా స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ ఓబుళపతి తాళం వేసి టీచర్లను నిలదీయడంతో ఏం చెప్పాలో తెలియక వారు తెల్లమొఖం వేశారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో చోటుచేసుకుంది.
ఇప్పటికే ఎనిమిది నెలల నుంచి కరోనా కారణంగా విద్యార్థుల చదువులు అంతంతమాత్రంగా ఉంటే దానికి తోడు టీచర్లు కూడా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తమ బిడ్డల భవిష్యత్తు ఎం అవుతుందని తల్లితండ్రులు ఉపాధ్యాయులను నిలతీసారు. మన రాష్ట్రంలో నూతనంగా ప్రతి పాఠశాలకి ‘స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ’ లను వైఎస్ జగన్ సర్కార్ విద్యార్థుల పేరెంట్స్ తో నియమించిన విషయం మనకు విదితమే.