ప్రకాశం జిల్లా దర్శిలో ఇటీవల తీవ్ర దిగ్భాంతికరమైన సంఘటన జరిగిన విషయం తెలిసిందే. దర్శి పట్టణంలో శ్రీకృష్ణుడి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు రక్తం చల్లి, మాంసం ముక్కలు చల్లారు. ఆలయ గోడలకు రక్తంతో ముద్రలు వేశారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న మాజీ ఎమ్మెల్య బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వేసిన శిలాఫలకానికి రక్తం పూశారు. దీంతో ఆలయంలో అపచారం జరిగిందనీ, జంతువును వధించారనీ, దీని వెనుక రాజకీయ కోణాలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. అయితే ఈ కేసును జిల్లా ఎస్పీ సిద్ధార్ధ్ కౌశల్ తీవ్రంగా పరిగణించి కేసు దర్యాప్తునకు ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేశారు. దర్శి డీఎస్పీ ప్రకాశరావు, సీఐ యండి మోయిన్లకు తగిన సూచనలు ఇచ్చి మూడు ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేశారు. దీంతో రెండు రోజుల వ్యవధిలోనే కేసును ఛేదించి నిందితుడి అరెస్టు చేశారు. ఈ ఘటనలో ఎలాంటి మతపరమైన, రాజకీయ కోణం లేదనీ, ముద్దాయి ఆకతాయితనంతో చేసిన దుశ్చర్య అని కనుగొన్నారు.
దర్యాప్తును ఎలా చేశారంటే…
ప్రత్యేక టీమ్లు ముందుగా ఘటన ప్రాంతంలో ఏదైనా జంతువును చంపినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయా అనేది పరిశీలించారు. సీసీ టీవీ ఆనవాళ్లు లభించలేదు. దీంతో ఆ ప్రాంతంలో చెడు నడత కల్గిన వ్యక్తుల గురించి విచారిస్తుండగా ఈ నెల 20వ తేదీన దర్శి పట్టణంలోని గొర్లగొడ్డకి చెందిన పెమ్మా వీర బల ప్రసన్న అలియాస్ కుందేలు అనే వ్యక్తి..అతని ఇంటి సమీపంలోని అంకాల నాగయ్య కుమారుడైన గౌతమ్ తో వారి కుక్క పిల్లను ఎలాగైనా చంపెస్తానని అన్నట్లు తెలిసింది. 22వ తేదీ నుండి అతను కనిపించకుండా పోయినట్లు, అదే రోజు ఉదయం నుండి అంకాల నాగయ్య ఆరు నెలల వయసు కల్గిన రాభి అని పిలిచే కుక్క పిల్ల కూడా కనిపించకుండా పోయినట్లు గుర్తించారు. దాని కోసం గాలిస్తుండగా గురువారం (ఈ రోజు) ఉదయం పది గంటల సమయంలో కనిపించకుండా పోయిన కుక్కపిల్ల దర్శి ప్రభుత్వ ఆసుపత్రి మెయిన్ గేటు ముందు ఉన్న కాలువలో తల లేకుండా, పొట్ట భాగం తెరిచి ఉండి అతి కిరాతకంగా చంపేసినట్లు ఉంది. దీనిపై అంకాల నాగయ్య దర్శి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.
ముద్దాయి అరెస్టు
దీంతో ఒక క్లారిటీకి వచ్చిన పోలీసులు చెడు నడత కల్గి గతంలో జంతువులను చంపినట్లుగా పేరున్న పెమ్మా వీర బాల ప్రసన్న అలియాస్ ప్రసన్న (కుందేలు) ఘటన జరిగిన నాటి నుండి కనిపించకుండా పోవడంతో అతని కోసం గాలించారు. ఈ క్రమంలో ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు పట్టుకున్నారు. అతన్ని పోలీసులు విచారించగా నేరాన్ని అంగీకరించాడు. ఈ నెల 21వ తేదీ రాత్రి ఒంటి గంట సమయంలో మద్యం సేవించి ఇంటికి వెళుతుండగా కుక్క పిల్ల తనను చూసి అరిచిందనీ, దీంతో కోపం రగిలిపోయి కుక్క పిల్లను చంపేసినట్లు ఒప్పుకున్నాడు. సూదిమొనలాగా ఉండే రాయితో కుక్క పిల్ల గొంతు కోసి, పొట్ట చీల్చి లోపల ఉండే గుండె, పొట్ట భాగాలు బయటకు తీసి ముద్దలను శ్రీకృష్ణుడి ఆలయ ప్రాంగణంలో విసిరివేసినట్లు చెప్పాడు. కుక్క పిల్లని ఈడ్చుకుంటూ వెళ్లి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మురుగు కాలువలో పడవేసి తన చేతికి ఉన్న రక్తాన్ని తుడుచుకోవాలనే ఉద్దేశంతో అక్కడే ఉన్న రోడ్డు శిలాఫలకానికి మరియు గుడి ప్రాంగణానికి చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్కు పూసినట్లు వెల్లడించాడు. గతంలో తాను పిల్లులను, తాబేళ్లను కూడా చంపి వేసినట్లు కూడా ఈ సందర్భంగా నేరాన్ని అంగీకరించాడు. నేరం అంగీకరించినందున అతన్ని దర్శి జెఎఫ్సీఎం కోర్టులో హజరుపర్చారు. ఈ కేసులో ఎలాంటి మతరమైన, రాజకీయ కోణం లేదనీ, కేవలం ముద్దాయి ఆకతాయి తనంతో చేసిన దుశ్చర్యమాత్రమేనని పోలీసులు వెల్లడించారు. కేసును ఛాలెంజ్గా తీసుకుని కేవలం రెండు రోజుల వ్యవధిలో చేధించిన దర్శి డీఎస్పీ ప్రకాశరావు, సీఐ మోయిన్, ఎస్ఐ రామకోటయ్య, సిబ్బందిలను ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు అందజేశారు.