రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా ఊపిన విషయం తెలిసిందే. ఎస్ఈసీ దాఖలు చేసిన రిట్ అప్పీల్ పై నేడు హైకోర్టు..ఎస్ఈసీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో వైసీపీ మినహా మిగిలిన అన్ని రాజకీయ పక్షాలు స్థానిక ఎన్నికలకు సై అంటున్నాయి. స్థానిక ఎన్నికలు అంటే వైసీపికి ప్రతికూల ఫలితాలు వస్తాయన్న భయం అయితే లేదు కానీ ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నంత కాలం ఎన్నికలు నిర్వహించకూడదన్న పట్టుదలతో ఉంది. దీనికి ప్రధానంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు ఆడించినట్లు ఆడుతున్నాడనీ, ఆయన మనిషి అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే కరోనా వ్యాక్సినేషన్ సాగుగా చూపి ఎన్నికలు ఫిబ్రవరిలో వద్దని ప్రభుత్వం చెబుతోంది. మార్చి నెలలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ విరమణ అయిన తరువాత కొత్త కమిషనర్ ఆధ్వర్యంలో స్థానిక ఎన్నికలకు వెళ్లాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఇది అందరికీ తెలిసిన నిజమే.
అయితే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నెల్ ఇవ్వడంతో ఈ తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్లే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే పలువురు మంత్రులు ఈ విషయాన్ని వెల్లడించారు. అదే విధంగా ఉద్యోగ సంఘాలు కూడా ఎన్నికల ప్రక్రియ నిలిపివేయాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు సన్నద్దం అయ్యారు. ఉద్యోగుల సంఘాల ఫెడరేషన్ చైర్మన్ వెంకట్రామిరెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంతకు ముందు హైకోర్టులో వీరు ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయగా ధర్మాసనం కొట్టేసింది. కాగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అసలు ప్రభుత్వానికి, ఎస్ఈసీకి మధ్య సమన్వయమే లేదు. ఈ విషయం రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తెలుసు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం, ఎస్ఈసీ సమన్వయంతో ఎన్నికలు నిర్వహించాలంటూ సూచనలు చేయడం గమనార్హం.
ఇదిలా ఉండగా పంచాయతీ ఎన్నికల విషయంలో హైకోర్టు తీర్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టులో న్యాయమూర్తులు మారినంత మాత్రాన న్యాయం మారదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం కూడా అనవసరం అన్న రీతిలో జగన్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు కూడా వద్దంటారేమో అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఏ రాజ్యాంగ వ్యవస్థలపైనా గౌరవం లేని వ్యక్తి జగన్ అంటూ ఘాటుగా విమర్శించారు.
కరోనా వేళ ఎన్నికలు నిర్వహించాలని పట్టుబట్టిన వారు ఇప్పుడు కరోనా తగ్గాక ఎన్నికలు పెడుతుంటే వద్దంటున్నారని అన్నారు. చరిత్రలో ఎన్నడూలేని బలవంతపు ఏకగ్రీవాలు చేశారని చంద్రబాబు అన్నారు. పనిలో పనిగా అమరావతి భూముల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ అనే అంశంపైనా మాట్లాడారు చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వం చేసిన ఇన్సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అనే పదం ఎక్కడ ఉంది అని అడిగారు చంద్రబాబు.