sajjala:ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికల పంచాయతీ ప్రభుత్వం వర్సెస్ ఎస్ఈసీ అన్నట్లుగా ఇప్పటి వరకూ జరిగిన సంగతి తెలిసిందే. ఓ పక్క రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ కొనసాగుతుంటే, ఎన్నికల నిర్వహణ ఎలా సాధ్యం అంటూ ప్రభుత్వం ప్రశ్నించింది. వ్యాక్సినేషన్ పూర్తి అయ్యే వరకూ ఎన్నికలు జరగడానికి వీలులేదని కుండబద్దలు కొట్టింది. ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు తోడై తాము వ్యాక్సినేషన్ పూర్తి కాకుండా ఎన్నికల విధులు నిర్వహించలేమని తెగేసి చెప్పాయి. ప్రభుత్వం వద్దన్నా, ఉద్యోగ సంఘాలు బాయ్ కాట్ చేస్తామన్నా ఇవేమీ లెక్క చేయకుండా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చేశారు. దీంతో ఈ వ్యవహారం హైకోర్టు, ఆ తరువాత సుప్రీం కోర్టు వరకూ వెళ్లి పీటముడి వీడింది. ఎన్నికలకు సుప్రీం కోర్టు పచ్చజెండా ఊపేసింది. దీంతో సర్వోన్నత న్యాయ స్థానం తీర్పును గౌరవించి ప్రభుత్వం ఎన్నికలకు సన్నద్దం అవుతోంది.
సుప్రీం తీర్పును గౌరవిస్తాం
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సుప్రీం కోర్టు తీర్పుపై స్పందించారు. సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తామని ఆయన పేర్కొన్నారు. అయితే ఇదే సందర్భంలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మరో సారి విమర్శలు సంధించారు. మధ్యలోనే ఆగిపోయిన జడ్పీటీసీ, ఎంపిటిసీ ఎన్నికలను నిమ్మగడ్డ నిర్వహించకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంలోనే కుట్ర ఉందని ఆరోపించారు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చిన తరువాత నిమ్మగడ్డ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా కేంద్రానికి లేఖ రాయడం సరికాదన్నారు. ప్రభుత్వంతో చర్చించాలన్న ఆలోచన ఇప్పటికీ ఎస్ఈసీకి లేదని విమర్శించారు. ప్రజారోగ్యం కోసమే తాము ఎన్నికలు వద్దనుకున్నామనీ, ఎవరిపైనా పై చేయి సాధించాలని ఎన్నికలు వాయిదా కోరలేదని సజ్జల అన్నారు. సిబ్బందికి ఏదైనా జరిగితే అందుకు ఎస్ఈసీదే పూర్తి బాధ్యత అని సజ్జల పేర్కొన్నారు. ప్రభుత్వం భేషజానికి పోవడం లేదని చెప్పుకొచ్చారు. ఎస్ఈసీ నిర్ణయించిన విధంగానే ఎన్నికలు జరుగుతాయని అన్నారు.
వ్యాక్సినేషన్ పై కేంద్రంతో చర్చిస్తాం
అయితే వ్యాక్సినేషన్, ఎన్నికలు ఒకే సారి నిర్వహిస్తే గందరగోళ పరిస్థితులకు దారి తీస్తాయని సుప్రీం కోర్టుకు వివరించామన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించాల్సిన పరిస్థితులు ఏర్పడినందున వ్యాక్సినేషన్ పై కేంద్రంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం, గెలవడం వైసీపీకి కొత్తకాదని అన్నారు. చంద్రబాబులా ఎన్నికలకు భయపడి వెనకడుగు వేసే పార్టీ వైఎస్ఆర్ సీపీ కాదని అన్నారు.