మొత్తానికి ఊహించిన పరిణామమే చోటుచేసుకుంది. వ్యవస్థల మధ్య మనస్పర్థలు ఈ పంచాయతీ ఎన్నికల రగడకు మూలం అయినప్పటికీ…. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ప్రజాస్వామ్యంలో అత్యున్నత వ్యవస్థలను నడిపించేందుకు కీలకమైన వ్యక్తులు కొంతమంది ఉంటారు. ముందు ముఖచిత్రంగా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వంటి పాలకులు ఉన్నప్పటికీ చుట్టూ ఉండే విధేయులు ఇచ్చిన సలహాలను బట్టేవారు నడుచుకుంటారు.
అవతలి వారి శక్తిని అంచనా వేయలేరా?
ఇలాంటి వారి వల్లే ఏపీ ప్రభుత్వానికి ఈరోజు ఇబ్బందికర పరిస్థితి ఎదురయింది అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుంటే…. ప్రభుత్వం మాత్రం ప్రాక్టికల్గా ఎదురయ్యే సమస్యలను చూపించి ఎన్నికల వాయిదా వేయాలని ప్రయత్నించింది. అయితే ఎన్నికల సంఘం చాలా వ్యూహాత్మకంగా పావులు కదిపింది. చివరికి ఈ ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు వద్ద ఇరుకులో పడేసింది.
సుప్రీం వద్ద తెల్ల మొహం..!
ఇక జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే సలహాదారులు క్షేత్ర స్థాయిలో జరిగే పరిణామాలకు సంబంధించిన కనీస అవగాహన లేకుండా ఉండడంతో చివరికి ప్రభుత్వం నవ్వుల పాలు కావాల్సి వచ్చింది. మొత్తానికి ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం పంచాయితీ ఎన్నికలకు పచ్చజెండా ఊపేసింది. ద్విసభ్య ధర్మాసనం నుండి సంచలన తీర్పు వెలువడి ఎన్నికలు నిర్వహించడానికి వ్యాక్సినేషన్ అసలు అడ్డం కాదని పేర్కొంది. దేశంలో అన్ని చోట్ల లేని ఇబ్బంది ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎందుకు వచ్చింది అని ప్రశ్నించింది.
వారు సరిగ్గా ఉండుంటే….
వాస్తవానికి అధినేతలు ఒక మైండ్ సెట్ లో ఉంటారు. వారి చుట్టూ ఉన్న వారు ప్రవర్తించే తీరును బట్టి వారి ఆలోచనలు కూడా మారుతాయి. అంతేకాకుండా జగన్ తీసుకునే నిర్ణయాలకి ఆహా… ఓహో అనే బ్యాచ్ తప్పించి తర్వాత ఎదురయ్యే పరిస్థితి గురించి అతనికి వివరించి వారే కరువు అయినట్లు స్పష్టంగా అర్థం అవుతోంది. ఇప్పతి వరకు ప్రభుత్వం నుండి వచ్చిన ప్రతి వివాదాస్పద నిర్ణయం చూస్తే కచ్చితంగా ప్రభుత్వానికి విషయంలో కోర్టు వద్ద ఎదురుదెబ్బ తప్పదని ప్రతి సామాన్యుడికి తేలిగ్గా అర్థం అయిపోతుంది. ఇక మరి జగన్ పక్కన సలహాదారులుగా ఉన్నవారు ఏమి చేస్తున్నారో వారికే తెలియాలి.
అసలు జగన్ సర్కార్ కి ఉన్న ఇమేజ్ చూసినట్లయితే పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను అధికార పక్షం సొంతం చేసుకోవడం ఖాయం. ఈ విషయాన్ని జగన్ కు తెలియజేసి పంతాలకు పోకుండా ముందే ఎన్నికలకు సానుకూలంగా స్పందించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. అత్యున్నత స్థానాల్లో ఉన్నవారు నిజాయితీగా ఉండకుండా ఉంటేనే ఇలాంటి నష్టాలు జరుగుతాయి.