Congress : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇంకో ముఖ్య నేత ఆ పార్టీకి గుడ్ చెప్పడం ఖరారైంది.
అయితే, ఎప్పట్నుంచో జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెడుతూ ఆయన్ను సస్పెండ్ చేసింది. సదరు నేత మాజీ ఎంపీ రాథోడ్ రమేష్. ఆదిలాబాద్ జిల్లా సీనియర్ నాయకులు, 2018 లో ఖానాపూర్ నియోజక వర్గం అసెంబ్లీకి పోటీ చేసిన రమేష్ రాథోడ్ ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు టీపీసీసీ క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ కోదండ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని జిల్లా నాయకుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత రమేష్ రాథోడ్ ను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ చేస్తున్నట్టు కోదండరెడ్డి ప్రకటించారు.
కొద్దికాలంగా అదే టాక్..
మాజీ ఎంపీ రమేష్ రాథోడ్.. త్వరలోనే బీజేపీలో చేరతారనే ప్రచారం గత కొంతకాలంగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో బలోపేతం అయ్యే చాన్స్ లేకపోవడం, బీజేపీ పుంజుకుంటున్న తరుణంలో ఆయన కాషాయ గూటికి చేరుతున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ సస్పెండ్ చేస్తున్నట్టు పార్టీ ప్రకటించింది.. .
వాళ్లు అమ్ముడుపోయారు…
తన సస్పెన్షన్పై మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ సీరియస్గా స్పందించారు. నన్ను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేశామని చెప్పే అర్హత వాళ్లకు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తానే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయాను.. ఎందుకంటే కాంగ్రెస్ నేతలు ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయారని ఆరోపించారు. నేను ప్రస్తుతం ఏ పార్టీలో చేరలేదు.. మా కార్యకర్తలతో చర్చలు జరిపిన తర్వాత.. ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.