AP Politics: రూ. 5 కోట్ల లంచం డిమాండ్.. సీబీఐ కేసు… ఇంటిపై దాడులు.. ఆస్తుల తనిఖీలు.. రూ. 300 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు.. సీబీఐ నోటీసులు.. రిప్లై లేకపోవడంతో నిన్న అరెస్టు. మే 7 వరకు రిమాండ్..! బొల్లినేని శ్రీనివాస గాంధీ కేసులో సింపుల్ గా జరిగింది ఇదీ.. కానీ ఈ గాంధీ ఎవరు..? చంద్రబాబుకి ఎందుకు సన్నిహితుడు..!? జగన్ కి ఎందుకు శత్రువు..? అనేది దీనిలో కీలక అంశాలుగా మారాయి. బొల్లినేని పై కేసు, అరెస్టుతో జగన్ శిబిరంలో బయటకు కనిపించని సంతోషం నెలకొంది..!!
AP Politics: శ్రీనివాస గాంధీ ఎవరంటే..!?
బొల్లినేని శ్రీనివాస్ గాంధీ ప్రస్తుతం సస్పెండ్ అయ్యారు. ఈయన 1992 లో సెంట్రల్ ఎక్సయిజ్ శాఖలో చేరారు. 2002 లో సూపెరెండింట గా పదోన్నతి పొందారు. పదేళ్లలో ఈ శాఖలో కీలక విధుల్లో నిర్వర్తిస్తూ చక్రం తిప్పారు. 2004 లో ఈడీకి వెళ్లారు. అక్కడ సమర్ధ అధికారిగా పేరు తెచ్చుకోవడంతో కీలక కేసులను డీల్ చేశారు. 2017 వరకు ఈడీలో కీలక విభాగంలో చేశారు. హైప్రొఫైల్ కేసులను విచారించారు. ఆ తర్వాత జీఎస్టీ కి బదిలీ అయ్యారు. 2017 నుండి 2021 ఫిబ్రవరిలో సస్పెండ్ అయ్యే వరకు జీఎస్టీ లోనే కీలకంగా పని చేశారు.
* ఈడీలో ఉన్నప్పుడే గాంధీ కీలక కేసులను డీల్ చేశారు. 2012 లో జగన్ అక్రమాస్తుల, మనీ లాండరింగ్ కేసులను బొల్లినేని శ్రీనివాస గాంధీ డీల్ చేశారు. అప్పట్లోనే ఆయనపై వైసీపీ నాయకులు కొన్ని ఆరోపణలు చేశారు.
* ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి జీఎస్టీ ఎగవేత.. ఈడీ కేసుల వ్యవహారంతో బొల్లినేని విచారణాధికారిగా ఉండేవారు. ఆ కేసులో సుజనా కు అనుకూలంగా వ్యవహరించి భారీగా లబ్ది పొందారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇవన్నీ బయటకు రాలేదు.
అరెస్టు చేసిన కీలక కేసు ఇదే..!!
ఇక సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీరింగ్ ఇటు తిరిగింది. 2012 నుండి బొల్లినేనిపై కన్నేసిన జగన్ అండ్ కో… అతను ఎక్కడైనా దొరకకపోతాడా అనే విధంగా ఎదురు చూస్తూ వచ్చింది. హైదరాబాద్ కి చెందిన “భరణి కమోడిటీస్ అండ్ హైదరాబాద్ స్టీల్స్” రూ. 1289 కోట్ల విలువైన నకిలీ ఇన్వాయిస్ లు తయారు చేసి.. రూ. 224 కోట్లు ఇన్పుట్ టాక్స్ ఎగ్గొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు విచారణలో భాగంగా రూ. 5 కోట్లు లంచం అడిగారని ఆ కంపెనీ డైరెక్టర్ సత్య శ్రీధర్ రెడ్డి బొల్లినేనిపై ఫిర్యాదు చేశారు.., బొల్లినేని శ్రీనివాస గాంధీ సహా సుధారాణి అనే మరో అధికారిపై ఫిర్యాదు చేసారు. దీనిపై విచారణ మొదలు పెట్టిన సీబీఐ తీగ మొత్తం లాగింది. 2019 జులై లోనే గాంధీ ఇంటిపై రైడింగ్స్ జరిపిన సీబీఐ ఆయన ఆదాయానికి మించిన ఆస్తులను కూటగట్టారని గుర్తించింది. కేసు నమోదు చేసి.., పలుమార్లు విచారణకు రావాలంటూ నోటీసులిచ్చింది. బొల్లినేని వీటిని పట్టించుకోలేదు. సీబీఐ విచారణకు సహకరించలేదు. అందుకే తాజాగా ఆయన్ను అరెస్టు చేసారు. సీబీఐ తో పాటూ ఈడీ కూడా రంగంలోకి దిగింది. మొత్తం రూ. 300 కోట్ల వరకు అక్రమాస్తులు కూటగట్టారని ఆయనపై అభియోగాలు ఉన్నాయి.
బాబు బృందంలో వణుకు.. జగన్ శిబిరంలో ఉత్సాహం..!!
శ్రీనివాస గాంధీ చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు. పోస్టింగులు, బదిలీల్లో చక్రం తిప్పే స్థాయికి వెళ్లారంటే అది చంద్రబాబు తెరవెనుక ప్రోత్సాహంతోనే. ఈ మొత్తం వ్యవహారంతో జగన్ శిబిరంలో ఉత్సాహం వెల్లివిరుస్తుంది. చంద్రబాబు కి అత్యంత సన్నిహితుడని.., రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి కేసుల్లోనూ బొల్లినేని ఆయనకు అనుకూలంగా వ్యవహరించారని జగన్ శిబిరం మొదటి నుండి ఆరోపిస్తుంది. ఇక ఈ అరెస్టుతో జగన్ అండ్ బృదం విజయసాయిరెడ్డి వంటి వారు పొంగిపోతున్నారు.. మే ఏడోతేదీ వరకు బొల్లినేని జైలులో ఉండాల్సిందే. మధ్య మధ్యలో సీబీఐ విచారకు వెళ్లాల్సి ఉంటుంది..!!