Chadrababu: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును ఇరకాటంలో పడేసేందుకు వచ్చే ప్రతి అవకాశం ఉపయోగించుకోవడంలో ముందుండే అధికార వైసీపీ తాజాగా మరో కొత్త కోణంలో ఆయన్ను ఇరకున పడేసే పని చేస్తోంది. అధికార పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్టు ఉదంతంపై టీడీపీకి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. దీంతో పాటుగా ఎంపీ విజయసాయిరెడ్డి సైతం కీలక వ్యాఖ్యలు చేశారు.
సజ్జల సంచలన వ్యాఖ్యలు..
సీఎం జగన్ కు వ్యతిరేకంగా రఘురామకృష్ణంరాజు కుట్రలు చేస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. రఘురామకృష్ణరాజు అరెస్ట్ రాత్రికి రాత్రే జరిగింది కాదన్నారు. రఘురామకృష్ణరాజుపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశామన్నారు. టీడీపీ అడ్డదారుల్లో వైసీపీ సర్కార్ ను అస్థిరపర్చే కుట్ర చేస్తోందని.. అందులో భాగంగానే రఘురామకృష్ణరాజును టీడీపీ వాడుకుందని సజ్జల ఫైర్ అయ్యారు. చట్టానికి లోబడే.. రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేశారని ఆయన పేర్కొన్నారు. రఘురామకృష్ణంరాజును అరెస్ట్ చేస్తే టీడీపీ గగ్గోలు పెడుతోందని ఇదేం చిత్రమని సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.
విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారుగా
టిడిపి అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కస్టడీలో ఉన్నఎంపీని కొట్టి హింసించారని చంద్రబాబు పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని..ఈ విషయంలో వారికి ఫస్ట్ ప్రైజు ఇవ్వవచ్చని ఎద్దేవా చేశారు. “కస్టడీలో ఉన్నఎంపీని కొట్టి హింసించారని చంద్రబాబు, ఆయన పచ్చ మీడియా హోరెత్తించిన అసత్యపు ప్రచారం ఈ ఏడాది ప్రపంచస్థాయి ‘పచ్చి అబద్ధాల’ పోటీలో ఫస్ట్ ప్రైజుకు ఎంపికైనట్టే. కొన్నేళ్లుగా ఈ పురస్కారం బాబు, పచ్చ పార్టీ ప్రముఖులకే దక్కుతుండటం తెలుగు ప్రజల గ్రహచారం.” అంటూ విజయసాయిరెడ్డి చురకలు అంటించారు.