Corona: కరోనా కలకలం కొనసాగుతున్న తరుణంలో టీకా వేయించుకోవడంపై ప్రజలు భరోసా పెట్టుకున్న సంగతి తెలిసిందే. కోవిడ్ టీకాల్లో దేశంలో అభివృద్ధి చెందించిన టీకాల్లో కోవిషీల్డ్ ఒకటి. అయితే, తాను కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నా యాంటీబాడీలు వృద్ధి చెందలేదంటూ యూపీలోని లక్నోకు చెందిన ప్రతాప్ చంద్ర అనే వ్యక్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కొవిషీల్డ్ తొలి డోసుతోనే యాంటీబాడీలు బాగా వృద్ధి చెందుతాయని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ చెప్పిన మాటలను ఈ సందర్భంగా అతడు ప్రస్తావించాడు. యాంటీబాడీలు వృద్ధి చెందకపోగా తాను అనారోగ్యానికి గురయ్యాయని, తనలో ప్లేట్లెట్లు సగానికి పడిపోయాయని అందులో ఆవేదన వ్యక్తం చేశాడు.
Read More: Black fungus: షాక్ః కరోనా రాకపోయినా… బ్లాక్ ఫంగస్ ముప్పు మనకు ఉంటుందట
ఫిర్యాదులో ఏం ఉందంటే…
ఏప్రిల్ 8న కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్నానని ప్రతాప్ చంద్ర అనే చెప్పాడు. అయితే తొలి డోసు తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఆమోదించిన ల్యాబ్లో తాను యాంటీబాడీ జీటీ టెస్టు చేయించుకున్నానని, తనలో యాంటీబాడీలు వృద్ధి చెందలేదని తేలినట్లు అతను ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు వ్యాక్సిన్ తయారు చేసే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలాతోపాటు డీసీజీఏ డైరెక్టర్, ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్, ఐసీఎంఆర్ డైరెక్టర్ బలరామ్ భార్గవ, నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ అపర్ణ ఉపాధ్యాయ్లపై ఆ వ్యక్తి ఆషియానా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. తాను 28 రోజుల తర్వాత రెండో డోసుకు వెళ్తే ఆరు వారాల తర్వాత రమ్మన్నట్లు తెలిపాడు.
Read More: Lock down: గుడ్ న్యూస్ః పక్క రాష్ట్రంలో లాక్ డౌన్ ఎత్తేస్తున్నారు
పోలీసులే షాక్ తిన్నారు…
కోవిడ్ వ్యాక్సిన్ టీకా పనిచేయడం లేదన్న విషయం సున్నితమైనది కావడంతో అతని ఫిర్యాదు తీసుకున్న పోలీసులు.. ఎఫ్ఐఆర్ మాత్రం నమోదు చేయలేదు. ఉన్నతాధికారులను సంప్రదించిన తర్వాత దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని వాళ్లు చెప్పారు. అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోతే తాను కోర్టుకు వెళ్తానని ప్రతాప్ చంద్ర అనే ఆ వ్యక్తి హెచ్చరించాడు.