National Anthem: చిన్నప్పటినుండి బడిలో లేదా ఎటువంటి కూడికల్లో అయినా భారతదేశ జాతీయ గీతం ఆలపించే సమయంలో లేదా ప్రసారం అయ్యే సమయంలో కచ్చితంగా ప్రజలంతా గౌరవార్థం తమ దేశ భక్తి చాటుకోవడానికి నిలబడాలని ప్రతి ఒక్కరు సూచిస్తుంటారు. అయితే జమ్మూకాశ్మీర్ హైకోర్టు మాత్రం ఈ విషయంలో సంచలన తీర్పునిచ్చింది.
జాతీయగీతం ప్రసారం అయ్యే సమయంలో నిలబడకపోవడం… గీతాన్ని ఆలపించకపోవడం వంటివి అమర్యాదకరమైనవిగా గుర్తించబడవని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. రాజ్యాంగంలోని అవమానాల నిరోధించే గౌరవ చట్టం 1971 ప్రకారం ఇది ఏమాత్రం నేరం కాదని జస్టిస్ సంజీవ్ కుమార్ తో కూడిన ఏకసభ్య ధర్మాసనం తీర్పునిచ్చింది.
జాతీయ గీతాన్ని గౌరవించడం అనేది ప్రాథమిక విధులలో ఒకటిగా రాజ్యాంగం పేర్కొంది అన్న పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది. వీటిని చట్టప్రకారం నిర్బంధంగా అమలు చేయలేమని అలాగే ఉల్లంఘించడం కూడా నేరంగా పేర్కొనలేం అని కోర్టు పేర్కొంది. జాతీయగీతం ప్రసారం అయ్యే సమయంలో పాడేందుకు సిద్ధం అయిన వారిని భంగం కలిగించడం నేరాలుగా పరిగణించబడతాయి… వాటికి జరిమానా విధించవచ్చు కానీ తమ ఇష్టానుసారం నిలబడకపోయినా ఆలపించకపోయినా వారికి ఎటువంటి శిక్షలు ఉండవని ధర్మాసనం పేర్కొంది.
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉగ్రవాదుల పై సైన్యం దాడి జరిగిన మొదటి వార్షికోత్సవాన్ని 2018 లో ఒక కాలేజ్ లో నిర్వహించారు. ఆ సమయంలో జాతీయ గీతం ప్రసారం అయ్యే సమయంలో అధ్యాపకుడు ఆసిఫ్ అహ్మద్ లేచి నిలబడలేదని కొందరు విద్యార్థులు అతనిపై నమోదు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే 2019లో బీజేపీ ఎంపీ శర్మ ఒక బిల్లును ప్రవేశపెట్టారు. జాతీయగీతం ప్రసారం అయినప్పుడు శారీరక వికలాంగులైన వారికి మాత్రమే నిలబడకుండా ఉండవచ్చని మిగిలిన వారంతా అలా చేయకపోతే సెక్షన్ 3 కింద శిక్షార్హులు అవుతారని పేర్కొన్నారు. అయితే కోర్టు మాత్రం ఈ బిల్లును తోసిపుచ్చింది.