Telugu Cine industry: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సంస్కరణల పేరిట తీసుకుంటున్న పలు నిర్ణయాలు కొన్ని పరిశ్రమలను దెబ్బతీస్తున్నాయి. కొన్ని ఇండస్ట్రీలను పాతాళంలోకి తొక్కేస్తున్నాయి. అన్నింటిపైనా ప్రభుత్వ పెత్తనం ఉండాలి, అన్ని రంగాలపై తన పెత్తనమో ఉండాలి, తమ వాళ్ల పెత్తనమే ఉండాలి అనుకోవడం మూర్కత్వం. అందరూ నా మాట వినాలి, లేదా అందరూ నా సలహాలు పాటించాలి, అందరూ తమకు అనుకూలంగా ఉండాలి, తమ పార్టీకి ఓట్లు వేయాలనుకోవడం రాజకీయం. రాజకీయం చేయవచ్చు కానీ ముర్కత్వం చేయకూడదు. కానీ నేడు వైఎస్ జగన్మోహనరెడ్డి తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు మూర్కత్వపు దిశగా సాగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పెద్దల కన్ను సినీ పరిశ్రమపై పడింది. నిన్న ఏపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరికీ తెలుసు. అది ఆ పరిశ్రమ రంగాన్ని లొంగదీసుకోవడానికి అని భావిస్తున్నారు. దాని మీద సినీ పెద్దలు ఏలా స్పందిస్తున్నారు? ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఈ సాయంత్రం జరగనున్న మీటింగ్ ఏమని చర్చించనున్నారు? అసలు సినీ పరిశ్రమ వాయస్ ఏమిటి రాబోతున్నది అనేది ఆసక్తికరంగా మారుతోంది.
సినిమా హాలులో టికెట్ లను ప్రభుత్వమే అన్ లైన్ లో వెబ్ సైట్ నిర్వహించి అమ్ముతుంది. ఇలా అమ్మిన డబ్బును ప్రతి నెలా 30వ తేదీన ఆ ధియేటర్లకు, డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు పంపిస్తుంది. ఎవరికి ఎలా పంపాలో అలా పంపిస్తుంది ఇది అంత వరకూ బాగానే ఉంటుంది. అయితే ఇది ఒక రకంగా ధియేటర్లను కంట్రోల్ లో పెట్టడానికి, సినీ పరిశ్రమలో నల్లధనాన్ని కంట్రోల్ చేయడానికి లేదా సినిమా టికెట్లలో బ్లాక్ టికెట్ల విక్రయాన్ని, బాక్స్ ఆఫీసు బద్దలు కొట్టింది అన్న రికార్డులను కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ వేరే వర్షన్ సినీ పరిశ్రమ నుండి వినబడుతోంది. సినిమా తీసే డబ్బులేమో నిర్మాతవి. సినిమా కొనుక్కునేది డిస్ట్రిబ్యూటర్ లు, సినిమాని రిలీజ్ చేసేది డిస్ట్రిబ్యూటర్ల వద్ద షోకు ఇంత అని కొనుక్కుని వేసుకునేది ధియేటర్లు. టికెట్లు కొనుగోలు చేసేది ప్రజలు. అయితే ఈ నలుగురితో ఏ మాత్రం సంబంధం లేని ప్రభుత్వం మధ్యలో దూరడంలో ఉద్దేశం ఏమిటి ?. ప్రభుత్వానికి ఏమైనా సినిమా ఖర్చులతో గానీ నిర్మాణంలో గానీ సంబంధం ఉందా? అంటే అదీ లేదు. ధియేటర్లకు గానీ, నిర్మాతలకు గానీ ఏమైనా రాయితీలు ఇస్తుందా? అంటే అదీ లేదు.
ప్రభుత్వం టికెట్ ధరలు తగ్గించడానికి చర్యలు తీసుకున్నారు అంటే ఫరవాలేదు. దానిపై కొంత వరకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ మంచి నిర్ణయం కిందే భావించాలి. సినిమా రంగానికి సంబంధించి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ లతో ఏమాత్రం సంబంధంలేని ప్రభుత్వం సినిమా టికెట్లను ఆన్ లైన్ పోర్టల్ ద్వారా విక్రయించి నెల వరకూ వారి వద్ద ఉంచుకుని తరువాత ఇవ్వడం అంటే ఆ డబ్బును అప్పుగా తీసుకున్నట్లేగా భావించాలి. ప్రతి నెలా డబ్బులు ప్రభుత్వం సక్రమంగా ఇస్తుందన్న గ్యారెంటీ కూడా ఉండదు. ఈ నెల డబ్బులు మరుసటి నెలా తరువాత నెలా ప్రభుత్వం ఇచ్చినా ఆ రంగం వాళ్లు గట్టిగా ప్రభుత్వాన్ని అడగలేని పరిస్థితి ఉంటుంది. దీంతో సినీ పరిశ్రమ దెబ్బతినే అవకాశం ఉంటుందనే వాదన వినబడుతోంది.
ఈ విషయాలపై చర్చించేందుకు సినీ పెద్దలు అందరూ చిరంజీవి నివాసంలో నేటి సాయంత్రం భేటీ కావాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకున్నా రాజకీయ పెద్దలకు సినిమా పరిశ్రమలోని హీరోలు భజన చేస్తూనే ఉంటున్నారు. అనవసరంగా, అకారణంగా భజన ట్వీట్లు చేస్తుంటారు. ఇటు సీఎం జగన్మోహనరెడ్డికి, అటు సీఎం కేసిఆర్ కు అభినందనలు, శుభాకాంక్షలు అంటూ చిరంజీవి, మహేష్ బాబు తదితర పెద్ద పెద్ద హీరోలు ట్వీట్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏపి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై చిరంజీవి, సినీ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారు ? తమ వాయస్ గట్టిగా సీఎం జగన్ కు వినిపిస్తారా ? లేక కోర్టులో పిటిషన్ వేసి తేల్చుకుంటారా ? అనేది వేచి చూడాలి.
Read More: Visakhapatnam Land Scam YCP MLA: విశాఖలో భూ బాగోతం..! ఆయన పాత్ర ఏమిటో..?