TSRTC: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచీ ఆర్టీసీ సేవలకు మంచి గుర్తింపు ఉంది. పల్లెల్లో ప్రజలకు అనువైన రవాణా సాధనం ఆర్టీసీ బస్సు. రెండు తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత కూడా ఆర్టీసీ తన సేవల్లో ఏ మార్పూ లేకపోగా.. ప్రజలకు మరిన్ని సేవలు అందిస్తున్నాయి. ప్రజా రవాణా మాత్రమే కాకుండా పార్శిల్ సేవలు కూడా అందిస్తోంది. నిత్యం ప్రజా జీవనంలో మమేకమైన ఆర్టీసికి తెలుగు ప్రజలతో విడదీయరాని అనుబంధం ఉంది. అటువంటి ఆర్టీసీ కొందరి వల్ల అపఖ్యాతి కూడా మూటగట్టుకుంటోంది. ఇందుకు తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం మారేడు మాన్ దిన్నె గ్రామంలో జరిగిన సంఘటనే నిదర్శనంగా నిలుస్తోంది. ఓ రైతు పండించిన పంటపై ఆర్టీసీ డ్రైవర్ చూపిన అత్యాశ.. ఆ రైతుకు ఆగ్రహం తెప్పించింది.
బొప్పాయి పండ్ల కోసం..
నల్లమల అటవీ ప్రాంతంలోని మారుమూల గ్రామానికి రోజూ అచ్చంపేట డిపో నుంచి బస్సు నడుస్తుంది. గ్రామానికి చెందిన గోపయ్య అనే రైతు తన పొలంలో పండించే బొప్పాయి పండ్లను నిత్యం సమీపంలోని కొల్లాపూర్ పట్టణానికి బస్సులో తీసుకెళ్లి అమ్మి జీవనం కొనసాగిస్తున్నాడు. ఈక్రమంలోనే శుక్రవారం బొప్పాయిని బస్సులో తీసుకెళ్లేందుకు సిద్ధమవ్వగా ఆర్టీసీ డ్రైవర్ ఉచితంగా పండ్లు ఆశించాడు. రైతు తిరస్కరించడంతో బస్సు ఎక్కించుకోకుండా వెళ్లిపోయాడు. తీవ్ర ఆవేదనకు గురైన రైతు బస్సు కొల్లాపూర్ నుంచి తిరిగి వచ్చే సమయంలో రోడ్డుపై బొప్పాయి పండ్ల బుట్టలు అడ్డుపెట్టి నిరసన వ్యక్తం చేశాడు. బస్సును గంటసేపు కదలనీయలేదు. దీంతో ఈ సంఘటన సంచలనం రేపింది.
ఉన్నతాధికారుల కష్టం..
టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సంస్థను వృద్ధిలోకి తీసుకొచ్చేందుకు సరికొత్త ప్రణాళికలు, ప్రకటనలు, ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. ఆర్టీసీ ప్రయాణం సుఖవంతం.. ప్రజలకు ప్రియ నేస్తం అనే కాన్సెప్టుతో ప్రజల్లోకి సంస్థను తీసుకెళ్తున్నారు. హీరో అల్లు అర్జున్ నటించిన ఓ యాడ్ లో ఆర్టీసీని కించపరిచే విధంగా ఉందంటూ ఆ సంస్థపై కేసు కూడా పెట్టారు. సంక్రాంతికి రేట్లు కూడా పెంచలేదు. ఇంతగా ప్రజలకు చేరువ చేస్తూ.. సంస్థ ప్రతిష్టను పెంచేలా ఉన్నతాధికారులు ప్రయత్నిస్తుంటే.. కొందరు చేస్తున్న ఇటువంటి పనులు వారి కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరులా మారుస్తున్నాయి. ఇప్పటికైనా తమ తీరుతో ప్రజలను ఆకట్టుకోవాలే కానీ.. ఇబ్బందులకు గురి చేయకూడదు.