తరుణ్ కుమార్.. ఈ హీరో గురించి ఎలాంటి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. 1990లో విడుదలైన `అంజలి`తో ఎనిమిదేళ్ల వయసులోనే సినీ కెరీర్ ను ప్రారంభించిన తరుణ్.. తొలి సినిమాతోనే జాతీయ అవార్డును అందుకున్నాడు. ఆ తర్వాత బాల నటుడిగా పలు సినిమాల్లో నటించిన ఈయన.. `నువ్వేకావాలి` వంటి సూపర్ హిట్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి అనతి కాలంలోనే స్టార్ హోదాను అందుకున్నాడు. ప్రియమైన నీకు, నువ్వే నువ్వే, నిన్నే ఇష్టపడ్డాను, నువ్వు లేక నేను లేను వంటి సినిమాలతో లవర్ బామ్ ఇమేజ్ ను సొంతం చేసుకుని అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు.
అయితే కెరీర్ లో ఎంత త్వరగా పైకి ఎదిగాడో.. అంతే త్వరగా పాతాళానికి పడిపోయాడు. ఒకానొక దశలో వరుస ఫ్లాపులు పడటంతో.. తరుణ్ కెరీర్ గాడి తప్పింది. ఆ తర్వాత ఆయన్ను ఫేడవుట్ హీరోల లిస్ట్ లో చేర్చేశారు. 2011లో విడుదలైన `చుక్కలాంటి అమ్మాయి చక్కనైన అబ్బాయి` అనంతరం తరుణ్ తెరపై కనిపించలేదు. మళ్లీ ఈయన 2018లో వచ్చిన `ఇది నా లవ్స్టోరీ`లో మెరిశాడు. కానీ, ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ మాజీ లవర్ బాయ్ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాడని తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది.
అది కూడా టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు మూవీతో అట. `సర్కారు వారి పాట` హిట్ తరువాత మహేశ్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తోన్న హ్యాట్రిక్ మూవీ ఇది. `ఎస్ఎస్ఎమ్బీ 28` వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోయే ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా అలరించబోతోంది. తమన్ స్వరాలు అందిస్తున్నారు. సెప్టెంబర్ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర ఉంటుందట.
ఆ పాత్ర కోసం త్రివిక్రమ్ తరుణ్ ను ఎంపిక చేసుకున్నారట. ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తి అయ్యాయని టాక్ నడుస్తోంది. తరణ్ డబ్యూ మూవీ `నువ్వే కావాలి` కి త్రివిక్రమ్ కథ అందించారు. అలాగే తరుణ్ హీరోగా వచ్చిన `నువ్వే నువ్వే` సినిమాతోనే త్రివిక్రమ్ డైరెక్టర్ గా కెరీర్ ను ప్రారంభించారు. ఆ సన్నిహిత్యంతోనే తరుణ్ మహేశ్ మూవీలో నటించేందుకు అంగీకరించారని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.