తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్.. కేంద్ర ప్రభుత్వ విద్యుత్ సంస్కరణలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయిన వాళ్లకు ఆకుల్లో, కాని వారికి కంచాల్లో పెట్టడమే కేంద్ర ప్రభుత్వ విధానమా అని కేసిఆర్ ప్రశ్నించారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా రెండో రోజు ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వ విద్యుత్ చట్ట సవరణ బిల్లుపై కేసిఆర్ మాట్లాడారు. తొలుత బీజేపీ సభ్యుడు రఘునందనరావు మాట్లాడుతూ వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించాలని సవరించిన బిల్లులో ఎక్కడా లేదని అన్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం పలు కేటగిరీల వినియోగదారులకు అందించే విద్యుత్ సబ్సిడీలను రద్దు చేయాలని కేంద్రం ఎక్కడా పేర్కొనలేదని స్పష్టం చేశారు. తాము సబ్బిడీలు ఇస్తుంటే కేంద్రం తొలగించమంటోందంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వాదనల్లో నిజం లేదని రఘునందరావు అన్నారు.
అనంతరం సీఎం కేసిఆర్ మాట్లాడారు. అభివృద్ధిని అంచనా వేసేందుకు అనేక కొలమానాలు ఉంటాయనీ, ఏ దేశం ఎంత విద్యుత్ వాుడతుందనేది ప్రధాన సూచిక అని వివరించారు. విద్యుత్ చట్టంపై కేంద్రం పెత్తనం ఏమిటని కేసీఆర్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాలకు మాట మాత్రంగా కూడా చెప్పకుండా ఇష్టం వచ్చినట్లు చేశారని ఆరోపించారు. లోక్ సభలోనూ మాట్లాడే పరిస్థితి లేదని, తిరిగి విపక్షాలపైనే దాడులు చేసే పరిస్థితి ఉందని అన్నారు. ఎంత హార్స్ పవర్ ఉన్న మోటర్లు పెట్టాలన్న దానితో సంబంధం లేకుండా తెలంగాణ రైతులకు 24 గంటల పాటు కరెంటు ఇచ్చామన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. విద్యుత్ సంస్కరణ ముసుగులో రైతులను దోచేందుకు కేంద్రం ప్రయత్నిస్తొందని అన్నారు. ఏపిలోని శ్రీకాకుళంలో కేంద్రం విద్యుత్ మోటార్లుకు మీటర్లు పెట్టిందని దాంతో అక్కడి రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపట్టారని కేసిఆర్ వివరించారు. విద్యుత్ సంస్కరణలను కేంద్రం ఉపసంహరించుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. కేంద్రం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా విమర్శించిన కేసిఆర్ విద్యుత్ సంస్కరణలను అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు.
కేంద్రంలోని బీజేపీ అధికార మదంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతోందని కేసిఆర్ విమర్శించారు. బీజేపీకి ఎప్పుడూ 50 శాతం ఓట్లు కూడా రాలేదన్నారు. ఇప్పటి వరకూ 11 రాష్ట్రాలను కూలగొట్టారని కేసిఆర్ అన్నారు. రాజ్యాంగ సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తుందని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం ఒక్క మంచిపని అయినా చేసిందా అని ప్రశ్నించారు. సమయం వచ్చినప్పుడు ప్రజలు తమ బలం ఏమిటో చూపుతారని అన్నారు. ప్రధాని, కేంద్ర మంత్రుల అవివేక చర్యలతో దేశం ప్రమాదంలో పడిందన్నారు. రైతుల భూములను కబళించేందుకు కుట్రలు జరుగుతున్నాయని కేసిఆర్ ఆరోపించారు.
ఏపికి మూడు వేల కోట్లు విద్యుత్ బకాయిలు కట్టాలని కేంద్రం చెబుతోందనీ, నెల రోజుల్లో కట్టకపోతే 18 శాతం వడ్డీతో చెల్లించాలని అంటోందనీ, అసలు ఏపి నుండే తెలంగాణకు రూ.17,280 కోట్లు రావాల్సి ఉందన్నారు కేసిఆర్. అందులో ఆరువేల కోట్లు మినహాయించి మిగతా మొత్తం ఏపి నుండి కేంద్రమే ఇప్పించాలని కేసిఆర్ డిమాండ్ చేశారు. ఏపిలోని కృష్ణపట్నం సహా అనేక రంగాల్లో తెలంగాణకు వాటా ఉందని అన్నారు. తాను చెప్పిన విద్యుత్ లెక్కలు అబద్దమని నిరూపిస్తే క్షణంలో సీఎం పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు కేసిఆర్.
అయిదు రోజుల విరామం తర్వాత శాసనసభ సమావేశమైంది. ఏడు బిల్లులను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అజామాబాద్ పారిశ్రామిక ప్రాంత చట్ట సవరణ, పురపాలక నిబంధనల చట్ట సవరణపై బిల్లులను మంత్రి కేటిఆర్, పబ్లిక్ ఎంప్లాయిమెంట్ పదవీ విరమణ నియంత్రణ చట్ట సవరణ బిల్లును వైద్య ఆరోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. జీఎస్టీ చట్టసవరణ బిల్లును మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అటవీ వర్శిటీ బిల్లును ఇంద్రకరణ్ రెడ్డి, వర్శిటీ ల ఉమ్మడి నియామక బోర్డు బిల్లును విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మోటారు వాహనాల పన్ను చట్టసవరణ బిల్లును పువ్వాడ అజయ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆ బిల్లులపై రేపు చర్చ చేపట్టనున్నట్లు స్పీకర్ వెల్లడించారు. నేడు, రేపు సమావేశాల్లో ప్రశ్నోత్తరాలను సస్పెండ్ చేశారు.
తెలంగాణ సీఎం కేసిఆర్ తో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భేటీ