ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మరో మారు సోదాలు నిర్వహిస్తున్నారు. దేశ వ్యాప్తంగా 35 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ, పంజాబ్, హైదరాబాద్, బెంగళూరు, ముంబాయిలలో ఈడీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఈ తెల్లవారుజాము నుండి ఈడీ అధికారులు సోదాలు ప్రారంభించారు. ఈ కేసులో ఈడీ సోదాలు జరపడం ఇది నాల్గవ సారి. ఈ కేసులో ఢిల్లీ జోర్ బాగ్ కు చెందిన మద్యం పంపిణీ సంస్థ ఇండో స్పిరిట్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) సమీర్ మహేంద్రు ను ఇటీవలే ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
దీంతో మహేంద్రు ఇచ్చిన సమాచారం మేరకు ఈ సోదులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ లో నాలుగు ప్రదేశాల్లో ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు. జూబ్లీహిల్స్, కూకట్ పల్లి తో పాటు మరో రెండు ప్రదేశాల్లో ఈడీ అధికారులు వివిధ పత్రాలను తనిఖీ చేస్తున్నట్లు సమాచారం. యూకో బ్యాంక్ ద్వారా డబ్బులు సమీర్ మహేంద్రు కొందరికి మద్యం కుంభకోణంకు సంబంధించి నగదు ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి.
ఈ కేసులో ఢిల్లీ డిప్యూటి సీఎం మనీష్ సిసోడియా, అప్పటి ఎక్సైజ్ కమిషనర్ అర్వా గోపీ కృష్ణ, డిప్యూటి కమిషనర్ ఆనంద్ తివారీ, అసిస్టెంట్ కమిషినర్ పంకజ్ భట్నాగర్ లతో పాటు పలువురు మద్యం తయారీ విక్రయదారులు ఉన్న సంగతి తెలిసిందే. మరో పక్క తాజాగా ఈడీ అధికారులు చేస్తున్న సోదాలపై ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మూడు నెలల్లో సీబీఐ, ఈడీ దాదాపు 500 దాడులు చేసి 24 గంటలు పని చేస్తున్నా మనీష్ సిసోడియాకు వ్యతిరేకంగా ఒక్క సాక్షం కూడా లభించలేదని అన్నారు. వారు (బీజేపీ) నీచ రాజకీయాల కోసం అధికారుల సమయాన్ని వృధా చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటి చర్యలతో దేశం ఎలా పురోగమిస్తుందని ప్రశ్నించారు కేజ్రీవాల్.