జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) మరో సారి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) సంస్థ పై దాడులు నిర్వహిస్తొంది. కేరళ వ్యాప్తంగా గురువారం ఉదయం నుండి సోదాలు ప్రారంభించింది ఎన్ఐఏ. పీఎఫ్ఐ నాయకులు, కార్యకర్తల ఇళ్లు, ఆఫీసుల్లో దాడులు నిర్వహిస్తొంది. మొత్తం 56 ప్రదేశాల్లో ఈ రైడ్స్ జరుగుతున్నాయి. పిఎఫ్ఐ సంస్థపై భారత ప్రభుత్వం ఇటీవల అయిదేళ్ల పాటు నిషేదించిన సంగతి తెలిసిందే. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడటంతో పాటు అక్రమ నిధులు కేసులో ఎన్ఐఏ, ఈడీ లు విచారణ జరుపుతున్నాయి.
గతంలో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పీఎఫ్ఐ పై దాడులు నిర్వహించిన ఎన్ఐఏ తాజాగా ఇప్పుడు మరో సారి పీఎఫ్ఐ నేతలు, సభ్యుల ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తొంది. తిరువనంతపురం, కొల్లం, పతనంతిట్ట, ఏర్నాకులం, అలప్పుజ, మలప్పురం జిల్లాల్లో ఈ దాడులు కొనసాగుతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారన్న అభియోగంపై కొద్ది నెలల క్రితం వంద మందికిపైగా పీఎఫ్ఐ నేతలు, కార్యకర్తలను ఎన్ఐఏ అరెస్టు చేసింది. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థతో ఈ నిషేదిత సంస్థ సంబంధాలు పెట్టుకుని నిధులు సేకరించేందుకు ప్రయత్నిస్తుందని ఎన్ఐఏ దర్యాప్తులో వెల్లడైంది.
పీఎఫ్ఐ సంస్థ ను కేంద్ర ప్రభుత్వం నిషేదించిన నేపథ్యంలో వేరే పేరుతో తిరిగి సంస్థను స్థాపించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తొంది. అజ్ఞాతంలో ఉన్న పీఎఫ్ఐ సభ్యులు సంస్థ కార్యకలాపాల్లో పాల్గొనేందుకు ప్రయత్నిస్తుండటంతో మరో సారి ఎన్ఐఏ దృష్టి సారించింది. కేరళలోనే క్రియాశీలకంగా కార్యకలాపాలు జరుగుతుండటంతో ఎన్ఐఏ ఆ రాష్ట్రంలోని కార్యకలాపాలపై దృష్టి పెట్టింది. దక్షిణాదిలోని కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో గత నాలుగైదు సంవత్సరాలుగా జరిగిన పలువురి హత్యల్లో పీఎఫ్ఐ హస్తం ఉందని ఎన్ఐఏ విచారణలో తేలింది.