ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విద్యాశాఖ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అందించారు. రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లు, పాఠశాల విద్యాశాఖలోని ఎడ్యుకేషన్ సొసైటీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 నుండి 62 సంవత్సరాలకు పెంచే ప్రతిపాదనకు అంగీకారం తెలిపారు. ఈ విషయాన్ని ఏపి ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ అధ్యక్షుడు కె వెంకట్రామిరెడ్డి చెప్పారు.
ఈ నెల 8వ తేదీన జరగనున్న కేబినెట్ సమావేశంలో ఈ అంశాన్ని అజెండాలో చేర్చాలని విద్యాశాఖను ఆయన ఆదేశించారని వెంకట్రామిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ను కలిసి ధన్యవాదాలు తెలియజేసినట్లు చెప్పారు. పదవీ విరమణ వయస్సు పెంపు ప్రతిపాదనకు అంగీకరించడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. సీఎం జగన్ ఉద్యోగుల పక్షపాతి అని మరో సారి నిరూపించుకున్నారని ఆయన తెలిపారు. గత ఏడాది సెప్టెంబర్ నెలలో ప్రభుత్వ విద్యాశాఖలో పని చేస్తున్న ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలని తాము సీఎం జగన్ ను కలిసినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి సీఎం జగన్ సానుకూలంగా స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో మరో సారి సీఎం ను కలిసినట్లు తెలిపారు.