దేశ వ్యాప్తంగా సైకిల్ యాత్ర నిర్వహిస్తున్న పర్వతారోహకురాలు ఆశా మాలవ్యను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అభినందించి రూ.10 లక్షల నగదు ప్రోత్సహకాన్ని ప్రకటించారు. కొద్ది రోజులుగా సైక్లింగ్ చేస్తూ అనేక రాష్ట్రాల్లో పర్యటిస్తున్న ఆశా మాలవ్య సోమవారం తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు. ఆశా లక్ష్యం నెరవేరాలని జగన్ ఆకాక్షించారు. సైకిల్ పై దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్ల 25 వేల కిలోమీటర్లు ప్రయాణించాలన్న లక్ష్యంగా పెట్టుకున్న తాను ఇప్పటి వరకూ ఏపీ సహా 8 రాష్ట్రాల్లో 8వేల కిలో మీటర్లు పూర్తి చేసినట్లు సీఎంకు ఆశ తెలిపారు. మధ్యప్రదేశ్ లోని రాజ్ ఘర్ జిల్లా సతారామ్ గ్రామానికి చెందిన ఆశా మాలవ్య మహిళా భద్రత, మహిళా సాధికారత అంశాలను విస్తృతంగా సమాజంలోకి తీసుకువెళ్లేందుకు దేశ వ్యాప్తంగా ఒంటరిగా సైకిల్ యాత్ర చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఆశా మాలవ్య మీడియాతో మాట్లాడుతూ ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. స్కూల్స్, కళాశాలల్లో అమ్మాయిల కోసం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శమన్నారు. నవంబర్ 1న భోపాల్ తో తన సైకిల్ యాత్ర ప్రారంభించానని చెప్పారు. ఏపి సర్కార్ మహిళల భద్రత కోసం ప్రవేశపెట్టిన దిశ ఎంతో గొప్పదన్నారు. తాను ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని చెక్ చేసినట్లు వివరించారు. తాను తిరుపతి వద్ద రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటి నుండి ప్రభుత్వం ప్రత్యేక రక్షణ అందించారని చెప్పారు. తన ఆశయం కోసం సీఎం జగన్ పది లక్షలు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. దేశం అభివృద్ధితో పాటు మహిళల భద్రత లాంటి విషయాలపై సీఎం జగన్ అభిప్రాయాలు ఏంతో గొప్పగా ఉన్నాయని కొనియాడారు.