TDP Janasena: ఉమ్మడి కడప జిల్లాలో రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక రాజకీయ ప్రత్యేకత ఉంది. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ అభ్యర్ధి విజయం సాధిస్తారో ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందన్న సెంటిమెంట్ ఉంది. అందుకే రాజకీయ పార్టీలు రాజంపేట స్థానానికి అభ్యర్ధి ఎంపిక విషయంలో గెలుపు అవకాశం నేతలను ఎంపిక చేసేందుకు తీవ్ర కసరత్తు చేస్తుంటాయి. ఈ నియోజకవర్గంలో జనసేనకు మంచి ఓటు బ్యాంక్ ఉంది. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్ధికి దాదాపు 15 శాతంపైగా అంటే 21,499 ఓట్లు వచ్చాయి. త్రిముఖ పోరు నేపథ్యంలో 12,342 ఓట్ల ఆధిక్యతతో నాడు కాంగ్రెస్ అభ్యర్ధి ఆకేపాటి అమరనాథ్ రెడ్డి విజయం సాధించారు.
2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచిన మేడా వెంకట మల్లికార్జున రెడ్డి 2019 ఎన్నికల నాటికి వైసీపీలో చేరి ఆ పార్టీ తరుపున పోటీ చేసి రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. రాబోయే ఎన్నికలకు టీడీపీ గట్టి నాయకత్వం కోసం ఎదురు చూస్తొంది. అయితే టీడీపీ టికెట్ కోసం నియోజకవర్గ ఇన్ చార్జి బత్యాల చెంగల్ రాయుడు తో పాటు మేడా విజయ శేఖర్ రెడ్డి, జగన్ మోహన్ రాజు, గంటా నరహరి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా నలుగురు టికెట్ కోసం రేసు లో ఉండటంతో పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించాలనే ఆలోచనలో టీడీపీ ఉన్నట్లుగా వార్తలు వినబడుతున్నాయి. కాపు (బలిజ) సామాజిక వర్గం ఓట్లు ఇక్కడ అధిక సంఖ్యలో ఉండటంతో ఈ సీటును జనసేనకు కేటాయించాలనే చర్చ కూడా జరిగిందని అంటున్నారు.
ఈ నియోజకవర్గంలో నిన్న మొన్నటి వరకూ జనసేనకు క్యాడర్ ఉన్నప్పటికీ నియోజకవర్గ ఇన్ చార్జి ఎవరూ లేరు. రాజంపేట నుండి జనసేన తరపున పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్న మాజీ డీఆర్డీఏ ప్రాజెక్టు అధికారి, పారిశ్రామిక వేత్త యల్లటూరి శ్రీనివాసరాజు రీసెంట్ గా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు. ఈ నియోజకవర్గం నుండి రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలన్న లక్ష్యంతోనే గత కొంత కాలంగా శ్రీనివాస రాజు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో పాటు జనసేన తరపున పలు కార్యక్రమాలు చేస్తూ వచ్చారు.
తాజాగా శ్రీనివాసరాజు అధికారికంగా పార్టీలో చేరడంతో జనసేన కు టికెట్ దాదాపు కన్ఫర్మ్ అనే మాట వినబడుతోంది. టీడీపీ – జనసేన ఉమ్మడి అభ్యర్ధి అయితే ఈ నియోజకవర్గం నుండి గెలుపు ఖాయమనే అంచనాలు ఈ రెండు పార్టీల్లోనూ ఉన్నాయి. కాపు (బలిజ) సామాజికవర్గ ఓటింగ్ తో పాటు క్షత్రియ ఓటింగ్ శ్రీనివాసరాజుకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. పిట్టపోరు పిట్టపోరు పిల్లి తీర్చినట్లు.. టీడీపీలో ఏకాభిప్రాయం లేకుండా ముగ్గురు నలుగురు టికెట్ ను ఆశిస్తుండటంతో మధ్య మార్గంగా జనసేనకు కేటాయించే ఆలోచనలో టీ డీ పీ కూడా ఉందని అంటున్నారు. చూడాలి ఏమి జరుగుతుందో..!
Rishi Sunak: భారీ వలసల అడ్డుకట్టకు బ్రిటన్ సర్కార్ కీలక నిర్ణయం .. ఇక వీసాలు కఠినతరం !
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!