అనకాపల్లి జిల్లాలోని యలమంచిలి నియోజకవర్గం తీవ్ర స్తాయిలో కాక రేపుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే యూవీ రమణమూర్తి రాజు కు టికెట్ లేదనే ప్రచారం జరుగుతుండడం.. మరోవైపు మంత్రి గుడివాడ అమర్నాథ్ టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేయడంతో వచ్చే 9వ జాబితాలో అయినా. ఈ నియోజ కవర్గంపై ఏదో ఒకటి తేల్చేస్తారా? లేదా? అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 15 సార్లు ఎన్నికలు జరిగాయి. ఆరుసార్లు టీడీపీ, నాలుగు సార్లు కాంగ్రెస్ పార్టీ, ఒకసారి వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు.
1983 నుంచి వరుసగా 1999 వరకు టీడీపీ విజయం దక్కించుకుంది. అయితే, 2004లో జరిగిన ఎన్నికల్లో యూవీ రమణమూర్తిరాజు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఇక్కడ విజయం సాధించారు. 2009లోనూ రాజు మరోసారి విజయాన్ని దక్కించుకున్నారు. 2014లో మాత్రం రాష్ట్ర విభజన ఎఫెక్ట్తో చంద్రబాబు హవా పెరిగిన నేపథ్యంలో ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేసిన పి రమేష్బాబు విజయం సాధించారు. వైసీపీ నుంచి పోటీ చేసిన ప్రగడ నాగేశ్వరరావుపై 8,455 ఓట్ల తేడాతో గెలుపొందారు.
2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన యూవీ రమణమూర్తిరాజు మరోసారి గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన పి రమేష్బాబుపై 4146 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించు కున్నారు. అంటే.. వైసీపీ హవా కొనసాగినప్పటికీ.. జగన్ హవా ఉన్నప్పటికీ.. ఇక్కడ టీడీపీహోరా హోరీ గా తలపడింది. ఇక, త్వరలోనే జరగనున్న ఎన్నికల్లో మరోసారి వైసీపీ నుంచి పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే రమణమూర్తి రాజు సిద్ధపడుతున్నారు. అయితే.. ఈయనకు పోటీగా మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడీ అవుతున్నారు.
తనకు ఇప్పటికే అనకాపల్లి సీటు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఆయన యలమంచిలి నుంచైనా బరిలోకిదిగాలని ప్రయత్ని స్తున్నారు. వైసీపీ అధినేత జగన్ మొగ్గు మంత్రి గుడివాడ వైపే ఉన్న నేపథ్యంలో ఏం జరుగుతుందోనని రాజు ఎదురు చూస్తున్నారు. ఇక, టీడీపీ నుంచి పలువురు నేతలు ఇక్కడ పోటీ పడుతున్నారు. ఎవరికి సీటు దక్కుతుందన్న దానిపై స్పష్టత కొరవడింది. జనసేన కూడా టికెట్ ఆశిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఎవరు బరిలో దిగినా.. పోరు మాత్రం అదిరిపోతుందనే చెబుతున్నారు.
Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!