హక్కుల కోసం పోరాడుటలో ఆత్మ గౌరవం ఉన్నదిరా అని ఎప్పుడో చిన్నప్పుడు ఓ పాట కమ్యునిస్టు సభల్లో వింటూ వుండేవాడిని. అది విన్నప్పుడల్లా ఎందుకో కళ్ళలో నీళ్ళు తిరిగేవి. హక్కుల కోసం ఎవరు ఉద్యమించినా ఆ పాటలోని పై వాక్యం తప్పక గుర్తుకొస్తుంది. తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె జరుగుతోంది. ఇప్పుడు కూడా ఆ వాక్యం గుర్తుకొస్తోంది. కాని మన కళ్ళ ముందే చరిత్ర తనను తాను తిరగ రాసుకోవడాన్ని చూస్తే ఆశ్చర్యమూ ఆవేదనా ఒకసారే కమ్ముకోవడం ఓ విచిత్రానుభూతిగా వుంది.
ఒకప్పుడు అడవుల్లో ఆదివాసీల హక్కుల కోసం ఉద్యమించిన అల్లూరి సీతారామరాజును గొప్ప విప్లవకారుడుగా అందరం కీర్తిస్తాం, పాలకులతో సహా. కానీ అదే ఆదివాసీల హక్కుల కోసం పోరాడేవాడు ఇప్పుడు దేశద్రోహిగా గుర్తింపబడుతున్నాడు. కార్పొరేట్లకు అడవుల్ని కట్టబెట్టే కాలంలో అల్లూరి సీతారామరాజులు ఇప్పుడు తిరగబడితే స్వదేశీ పాలకులే స్వయంగా కటకటాల్లో పెడతారు. పార్లమెంటులో బాంబులు విసిరిన భగత్ సింగ్ విప్లవకారుడే, దేశభక్తుడే. అదే భగత్ సింగ్ చూపిన విప్లవ మార్గంలో ఇప్పుడు ప్రయాణం చేసేవారంతా దేశద్రోహులే. అంటే హక్కులూ పోరాటాలూ ఉద్యమాలూ విప్లవాలూ కాలానుగుణంగా నిర్వచనాలను మార్చుకుంటాయన్నమాట. ఎవరి హక్కుల కోసం ఎవరు పోరాటాలు చేస్తున్నారు? వాటితో ఎవరి హక్కులకు లాభం..ఎవరి హక్కులకు భంగం? అనే ప్రశ్నకు జవాబులోనే మారుతున్న నిర్వచనాల రూపురేఖలు అర్థం చేసుకోవాలి. దేశంలో పరిపాలనా పగ్గాలు ఎవరి చేతుల్లోకి రావాలనుకున్నారో వారు ఆనాటి ఉద్యమాలనన్నింటినీ మహా విప్లవాలుగా వర్ణించారు. పగ్గాలు చేతుల్లోకి వచ్చాక అవే విప్లవాలను విద్రోహాలుగా పాలకులు చూస్తున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉవ్వెత్తున లేచిన ఉద్యమంలో సాధారణ కార్మికులు..ఉద్యోగులు..విద్యార్థులు..మావోయిస్టులు ఎంత కీలక పాత్ర పోషించారో మనకు తెలుసు. ఆ ప్రయోజనం నెరివేరిపోయింది. ప్రయోజనం పొందిన వర్గాలు ఒకప్పుడు ఎవరిని ఉద్యమకారులుగా అసలు సిసలు విప్లవకారులుగా కీర్తించారో ఇప్పుడు అదే వర్గాలు అదే ఉద్యమకారుల్ని ద్రోహులుగా స్వార్థపరులుగా ప్రజలకు, పరిపాలనా విభాగాలకు అవరోథం కలిగించేవారిగా అభివర్ణిస్తున్నారు. తమ హక్కుల కోసం పోరాడుతున్న వారిని సామాన్య ప్రజాప్రయోజనాలకు శత్రువులుగా చిత్రిస్తున్నారు. ఒకప్పుడు సకల జనుల సమ్మె ఒక చారిత్రాత్మక విప్లవం. ఇప్పుడది స్వార్థంతో సాగే సమ్మె. ఏ పోరాటమూ అందరి ప్రయోజనాల కోసం సాగదు. కొన్ని పోరాటాలు కొందరి ప్రయోజనాలతో ఘర్షించవచ్చు. కానీ పాలకులు కొందరి హక్కులను కాపాడడంలో ఎవరికీ నష్టం లేదనుకున్నప్పుడు కార్మికుల హక్కులను గౌరవించి వారితో సంప్రదింపులు జరిపి ఒక సానుకూల వైఖరిని తీసుకోవడం మంచిది. అలాగని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ కార్మికుల హక్కులు పాలకుల హక్కులతోనే ఘర్షిస్తున్నట్టుగా అర్థమవుతోంది. అహంకారం పాలకుల హక్కు. అణచివేత పాలకుల హక్కు. అందుకే కొన్ని పోరాటాలు కాలం మారుతున్న కొద్దీ కొందరి దృష్టిలో స్వరూపాలు..స్వభావాలూ నిర్వచనాలూ మార్చుకుంటూ వుంటాయి. అన్నిటికంటే విషాదం ఆత్మహత్యలే నిరసనకు ఆఖరి అస్త్రంగా మార్చివేసిన స్వార్థ చరిత్ర. ఆర్టీసీ కార్మికులు తిరిగి ఆత్మహత్యలనే ఆయుధంగా ఎంచుకుంటున్నారా? ఇప్పటికే ఇద్దరు ఆహుతైపోయారు. వారిప్పుడు పాలకుల దృష్టిలో వీరులు కాకపోవచ్చు. కానీ ఆత్మహత్య ఏ పోరాటానికీ ఆయుధం కాదని అన్ని కాలాలకూ సరిపడా ఒక సందేశాన్ని మాత్రం ఇవ్వాల్సిన బాధ్యత మనందరి మీదా ఉన్నది. హక్కుల కోసం పోరాడటంలో ఆత్మగౌరవం ఉన్నమాట నిజమే కాని ఆ పోరాటానికి ఆత్మహననం ఎంత మాత్రం మార్గం కాదు. పోరాడితే సంకెళ్ళే పోతాయి. ఆ క్రమంలో ప్రాణాలు కోల్పోయిన వారున్నారు. వారి అమరత్వం రమణీయమే. కానీ ఆత్మహత్య ఆచరణీయం కాదు..కానేరదు. అందుకే పోరాడుతున్న కార్మిక సోదరుల కోసం ఈ చిన్ని కవిత.
||గుండె దిటవు చేసుకో||
ఆత్మహత్యలతో రాష్ట్రాన్ని సాధించగలరేమో
ఆత్మహత్యలతో రాజ్యాన్ని ఎదిరించలేరు–
పోరాటం ప్రాణాలు బలితీసుకోవచ్చు
ప్రాణాలు తీసుకోవడమే పోరాటం కాదు–
ఉద్యమానికి నీ ఊపిరి కావాలి
నీ ఊపిరే ఉద్యమం కాదు–
సమూహం నీ ఆశయమైనప్పుడు
పలాయనం నీ ఆయుధం కాకూడదు–
గుండెలు దిటవు చేసుకో
బండలైనా బద్దలవుతాయి–
విను..దిక్కుల నోట
నీ హక్కుల పాట విను !
నీ పని నువ్వు చేయి
కాలం తన పని తాను చేసుకుపోతుంది.
డా. ప్రసాదమూర్తి
ఎల్లో జర్నలిజం నడుమ జాతీయ పత్రికా దినోత్సవం…పత్రికా స్వేచ్ఛ ఒక భ్రమ