(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఎల్వీ సుబ్రమణ్యం ఆకస్మిక బదిలీ వ్యవహారం మత రాజకీయంతో వివాదాస్పదంగా మారుతోంది. ఎల్వీని జగన్ ప్రభుత్వం బదిలీ చేసిన వెంటనే పూర్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ హీందూ దేవాలయాలలో అన్యమతస్తులను తొలగించే విషయంలో గట్టిగా నిలబడినందుకు ఎల్వీకి బదిలీ బహుమానంగా ఇచ్చారంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎల్వీని ఆకస్మికంగా బదిలీ చేయడాన్ని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో పాటు జనసేన ఇతర రాజకీయ పార్టీలు కూడా తప్పుబట్టాయి. విపక్షాల విమర్శలను వైసిపి నేతలూ ఖండించారు. పరిపాలనా వ్యవహారాలలో అధికారుల బదిలీలు సర్వసాధారణమంటూ విపక్షాల విమర్శలను కొట్టిపారేశారు.
ఇదిలా ఉండగా ఎల్వీ బదిలీ కావడంపై దళిత క్రైస్తవ సంఘాల సమాఖ్య నేత జెరుసలేం మత్తయ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించడం మరో వివాదానికి దారి తీసింది. ఈ సందర్భంగా ఆయన లేఖ విడుదల చేస్తూ క్రైస్తవుల ప్రార్థనల విజయమే ఎల్వీ సుబ్రమణ్యం తొలగింపు అని పేర్కొన్నారు. దీనిపై వైసిపి నేత జూపూడి ప్రభాకరరావు స్పందిస్తూ ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ వ్యవహారాన్ని ప్రతిపక్షం రాజకీయం చేస్తోందని విమర్శించారు. మత్తయ్య కేక్ చేసి సంబరాలు చేసుకుంటే తమకేమిటి సంబంధం అని ఆయన ప్రశ్నిస్తున్నారు.
ముఖ్యమంత్రి పరిపాలనాధికారాలలో భాగంగా సిఎస్ను మార్చుకోవచ్చని జూపూడి పేర్కొన్నారు. దీనిపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందనీ ఆయన ఆరోపించారు. క్రైస్తవుల పూజల వల్లనే ఎల్వీ బదిలీ అయ్యాడని మత్తయ్య మతిభ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు. సిఎం జగన్ను ఒక కులానికి, మతానికి చెందిన వాడిగా ముద్రవేసే విధంగా మత్తయ్య లేఖ చెపుతోందనీ, దీని వెనుక చంద్రబాబు హస్తం ఉందనీ జూపూడి ఆరోపించారు. మత్తయ్య చంద్రబాబు చేతిలో మనిషి అని అందరికీ తెలుసుననీ, ఓటుకు నోటు కేసు సమయం నుండి చంద్రబాబు డైరెక్టన్లో మత్తయ్య పని చేస్తున్నారనీ ఆయన అన్నారు. మతాల మధ్య చంద్రబాబు చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. జగన్మోహనరెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక అభాసుపాలు చేయాలని చంద్రబాబు చూస్తున్నారని జూపూడి విమర్శించారు.