అమరావతి: ఏపీ మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం నెలరోజుల పాటు సెలవుపై వెళ్లనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తనను తప్పించి.. ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డైరెక్టర్ జనరల్గా నియమించడంతో ఎల్వీ సుబ్రమణ్యం అలకవహించారు. ఆయన సెలవుపై వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బుధవారం ఉదయం భూ పరిపాలన విభాగం చీఫ్ కమిషనర్గా ఉన్న నీరబ్ కుమార్కు చీఫ్ సెక్రటరీగా బాధ్యతలను ఎల్వీ సుబ్రమణ్యం అప్పగించారు. అనంతరం ఆయన బాపట్లలోని హెర్ఆర్డీ ఇన్ స్టిట్యూట్ డీజీగా బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. కానీ, కొత్త బాధ్యతలను స్వీకరించకుండానే ఎల్వీ సెలవుపై వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇవాళ్టి నుంచి డిసెంబర్ 6 వరకూ ఎల్వీ సుబ్రహ్మణ్యం సెలవు పెట్టారు.
ఎల్వీ సుబ్రహ్మణ్యంను సీఎస్ పదవి నుంచి బదిలీ చేస్తూ నవంబర్ 4న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీఎంవోలో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రవీణ్ ప్రకాష్కు షోకాజ్ నోటీసులు ఇచ్చినందుకు ఎల్వీపై బదిలీ వేటు పడినట్లు చర్చ జరుగుతోంది. బిజినెస్ రూల్స్ను సవరిస్తూ.. ప్రవీణ్ ప్రకాష్ జారీ చేసిన జీవోపై సీఎస్ అభ్యంతరం తెలిపారు. సీఎంవో పీఎస్ విషయంలో సీఎస్ వైఖరిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారట. సీఎంవో ఉత్తర్వులు తప్పుపట్టడం సరికాదని భావించిన ప్రభుత్వం.. తాజా పరిణామాలతో ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, షోకాజ్ నోటీసులు అందుకున్న ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ పేరుతో ఈ ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. ఎల్వీ సుబ్రమణ్యం పదవీకాలం మరో ఐదునెలల సర్వీసు ఉండగానే బదిలీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత సీనియర్ అయిన కొద్దిమంది ఐఏఎస్ల్లో ఒకరిని సీఎస్గా నియమిస్తుంటారు. కాబట్టి, ఈ హోదాలో వీరి పదవీకాలం చాలా తక్కువ ఉంటుంది. తన ప్రభుత్వం హయాంలో పనిచేసే ఐఏఎస్లను బదిలీ చేసే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. అయితే, ఆ బదిలీ ఉత్తర్వులు జారీ చేసేది మాత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే. అలాంటిది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శినే బదిలీ చేస్తూ ఉత్తర్వులు విడుదల చేయడంతో ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది. సీఎస్ను మార్చినప్పుడు లేదా కొత్త సీఎస్గా మరొకరు నియమితులైనప్పుడు మాత్రం ఆ ఉత్తర్వులను సాధారణ పరిపాలన విభాగం ముఖ్య కార్యదర్శి జారీ చేస్తారు. ఇప్పుడు ఎల్వీ సుబ్రహ్మణ్యంను బదిలీ చేస్తూ ప్రవీణ్ ప్రకాష్ కూడా ఆ హోదాలోనే జీఓ జారీ చేశారు.
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత అప్పటి ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పునేఠా స్థానంలో ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఎన్నికల సంఘం నియమించింది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్యాన్నే సీఎస్గా కొనసాగించారు. ఎన్నికల సమయంలో వైఎస్ఆర్సీపీ నేతలు సీఎస్పై ప్రశంసలు గుప్పించారు. కానీ అనూహ్యంగా జగన్ సర్కారు ఆయన్ను ఎందుకు బదిలీ చేసిందనే ప్రశ్న రాజకీయ నేతలతోపాటు సామాన్యుల్లో సైతం తలెత్తుతోంది. కోరి తెచ్చుకున్న ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని ఎందుకు బదిలీ చేశారో చెప్పారంటూ విపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. కీలక నిర్ణయాల విషయంలో సీఎం జగన్, సీఎస్ మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తిందనీ, అందుకే ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేశారని రాజకీయ పార్టీల నేతలు చెబుతున్నారు.