విశాఖ: ఒక దివ్యాంగ మీసేవా నిర్వహకుడు ఆత్మహత్య చేసుకుంటానంటూ వాయిస్ మెసేజ్ పెట్టడం విశాఖపట్నం మధురవాడ ప్రాంత్రంలో కలకలం రేపింది. మీ సేవా కేంద్రాల ద్వారా అందే సేవలను ఇకపై గ్రామ సచివాలయాల్లోనే అందించాలని వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం నిర్ణయించడంతో తన ఉపాధి పోతుందన్న ఆందోళనతో మధురవాడ వాంబే కాలనీకి చెందిన దివ్యాంగ మీ సేవా నిర్వహకుడు శ్రీహరి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ స్నేహితులకు వాయిస్ మేసేజ్ పెట్టాడు. శ్రీహరి అనే దివ్యాంగుడికి గత ప్రభుత్వం మీసేవా కేంద్రం మంజూరు చేసింది. ఆ యువకుడు దీన్ని నడుపుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నాడు.
జనవరి ఒకటవ తేదీ నుండి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అన్ని సేవలూ అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటి నుండి రాష్ట్రంలో మీసేవా నిర్వహకులు ఆందోళన బాట పట్టారు. వివిధ రూపాల్లో నిరసనలు వ్యక్తం చేసిన మీసేవా నిర్వహకులు గత పది రోజులకుపైగా కేంద్రాలను మూసివేసి నిరసన ఉదృతం చేశారు. వీరి ఆందోళనకు ప్రభుత్వం నుండి ఎటువంటి హామీ లభించలేదు. ఈ నేపథ్యంలో శ్రీహరి అనే యువకుడు తన మిత్రులకు పంపిన వాయిస్ మేసేజ్లో ఆరు నెలలుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించాడు. ప్రభుత్వం వెంటనే భరోసా ఇవ్వాలనీ లేకుంటే తన మీసేవా కేంద్రంలోనే ఆత్మహత్య చేసుకుంటాననీ పేర్కొన్నాడు. ఈ సందేశం చూసిన అతని స్నేహితులు హుటాహుటిన వాంబే కాలనీలోని వెళ్లి మీసేవ కేంద్రంలోనే తలుపువేసుకుని ఉన్న అతన్ని క్షేమంగా బయటకు తీసుకువచ్చారు.