ఒకపక్క గడిచిన ఎన్నికల్లో జరిగిన ఘోర పరాభవం.. మరోపక్క ఒక్కొక్కరుగా సైకిల్ దిగిపోతున్న పరిస్థితి.. ఇంతకాలం బాబుకు ఎంతో సన్నిహితంగా ఉన్న నేతలు కూడా పసుపు కండువా పక్కనపెడుతున్న వైనం.. దానికి తోడు తాజాగా సీబీఐ ఎంక్వైరీ.. ఇవి చాలవన్నట్లుగా జగన్ మరో కీలక ఆలోచన చేశారు. బాబుకు ఇప్పుడు ఇది మరోరకంగా కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. అదే… జగన్ గ్రామాల పర్యటన. ఇప్పటికే సంక్షేమ పథకాల అమలు విషయంలో తనదైన శైలిలో మొదటి ఏడాది పూర్తి చేసిన జగన్.. రెండో ఏడాదిలో జనాలను నేరుగా కలిసే ఆలోచన చేస్తున్నారు.
ఇందులో భాగంగా… సంక్షేమ కార్యక్రమాల అమలుతీరుని తెలుసుకోవడానికి అన్నట్లుగా ఆయన నేరుగా గ్రామాల పర్యటనకు సిద్దమవుతున్నారు. గ్రామాల్లోకి వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడి, పధకాల అమలులో జరుగుతున్న లోపాలు, ఇబ్బందుల గురించి తెలుసుకోవటానికి సిద్దమయ్యారు జగన్. వాలంటీర్ వ్యవస్థ మీద తాజాగా జరిగిన సమీక్షా సమావేశంలో జగన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ క్రమంలో ఆగస్ట్ నుంచి గ్రామాల్లో పర్యటనకు ఆయన సిద్దమయ్యారు. ఈ సందర్భంగా జగన్ అధికారులకు ఒక సూచన కూడా చేశారు… అర్హులు ఎవరికి కూడా పథకాలు అందడం లేదు అని చేతులు ఎత్తకూడదు అని ఆదేశించారు.
జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుందనే అంటున్నారు. కరోనా సమయంలో రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో.. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి జగన్ సర్కార్ సంక్షేమ పథకాల అమలు విషయంలో వెనక్కి తగ్గని సంగతి తెలిసిందే. ఈ కష్టానికి తగ్గ ఫలాలు సామాన్యుల చేతికి అందే విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని కాని, మరెలాంటి అవకతవకలను కానీ ఉపేక్షించేది లేదన్నట్లుగా జగన్ ఈ పర్యటన చేపట్టనున్నారు. అయితే ఈ పర్యటన వెనక కేవలం పథకాల అమలు, గ్రామస్థాయిలో ప్రజలతో ఇంటరేక్షన్ మాత్రమే కారణమా లేక మరేదైనా రాజకీయ కారణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్న దశలో… ఈ దెబ్బతో చిన్న చిన్న పార్టీ ఇంటర్నల్ వ్యవహారాలు కూడా సెటిల్ అయిపోతాయని అంటున్నారు.