టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు యదేశ్చగా సాగించిన అమరావతి భూ కుంభకోణాల బాగోతాన్ని ఏపీ సీఐడీ బట్టబయలు చేసింది. చంద్రబాబు, అప్పటి మంత్రి పొంగూరు నారాయణ లు భూ దోపిడీ చేసినట్లుగా పేర్కొంది. అమరావతి లో సీడ్ క్యాపిటల్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ పేరిట క్విడ్ ప్రోకోకు పాల్పడినట్లుగా గుర్తించింది. దీంతో ఈ కేసులో ఏ 1 గా ఉన్న చంద్రబాబు కరకట్ట నివాసాన్ని అటాచ్ చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. దాంతో పాటు ఈ కేసులో ఏ – 2 గా ఉన్న పొంగూరు నారాయణ కుటుంబ సభ్యులు, బంధువులు, బినామీల పేరట అమరావతిలో ఉన్న 75,88 చదరపు గజాల ఇళ్ల స్థలాలు, భూ సమీకరణ కింద పొందిన కౌలు మొత్తం ర.1.92 కోట్లను కూడా అటాచ్ చేసేందుకు కోర్టు ఆదేశించింది. ఈ మేరకు విజయవాడలోని ఏసీబీ కోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు నివాసం ఉన్న కరకట్ట గెస్ట్ హౌస్, నారాయణ కుటుంబ సభ్యులు, బినామీ ల పేరిట ఉన్న ప్లాట్లు, బ్యాంకు నిల్వలను బదలాయించేందుకు, మార్పులు చేసేందుకు వీలు లేదని ఉత్తర్వులో పేర్కొంది కోర్టు. ఈ కేసులో పూర్తి స్థాయి అటాచ్ మెంట్ కోసం కేసు విచారణ కొనసాగుతుందని తెలిపింది. అమరావతి లో చంద్రబాబు, నారాయణ సాగించిన భూ అక్రమాలను సిట్ నిర్దారించింది.
అమరావతి మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు టీడీపీ ప్రభుత్వం నామినేషన్ పద్దతిలో కన్సల్టెన్సీని ఎంపిక చేసింది. లింగమనేని రమేష్, లింగమనేని రాజశేఖర్, హెరిటేజ్ ఫుడ్స్, చంద్రబాబు బినామీలకు చెందిన భూములు ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రాకుండా .. వారి భూముల వెలుపలి నుండే ల్యాండ్ పూలింగ్ చేసేలా మాస్టర్ ప్లాన్ ఖరారు చేశారు. అందుకు ప్రతిగా చంద్రబాబు కుటుంబానికి లింగమనేని కుటుంబం భారీగా ప్రతిఫలాన్ని ముట్టజెప్పిందనీ, ఇన్నర్ రింగ్ రోడ్డుకు అనుకుని ఉన్న భూములను హెరిటేజ్ ఫుడ్స్ కు విక్రయించడంతో పాటు కృష్ణానది కరకట్ట మీద ఉన్న నివాసాన్ని కూడా చంద్రబాబుకు అప్పగించారనేది ప్రధాన ఆరోపణ. లింగమనేని నుండి హెరిటేజ్ పుడ్స్ కు భూమి, కరకట్ట నివాసమే కాకుండా లింగమనేని కుటుంబ భుములను కూడా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ కు అప్పగించిందని సిట్ దర్యాప్తులో వెల్లడైంది. 2014 లో లింగమనేని కుటుంబ సభ్యుల నుండి హెరిటేజ్ ఫుడ్స్ నాలుగు ఎకరాలకు కొనుగోలు ఒప్పదం కుదుర్చుకున్నట్లు చూపారు. అమరావతి ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి రాకుండా ఇన్నర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉన్న భూమినే హెరిటేజ్ ఫుడ్స్ కు బదలాయించారు. ఆ సమయంలో నారా లోకేష్ డైరెక్టర్ గా ఉన్న హెరిటేజ్ పుడ్స్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు.
నారాయణ తమ బంధువులు, బినామీల పేరిట సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో కొనుగోలు చేసిన 65.50 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ కింద సీఆర్డీఏకు ఇచ్చారు. అందుకు ప్రతిగా ల్యాండ్ పూలింగ్ ప్యాకేజీ కింద సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో అత్యంత విలువైన 75,888 చ.గజాల స్థలాలను పొందారు. మరో పక్క సీఎం హోదాలో చంద్రబాబు జీతంతో పాటు హౌస్ రెంట్ ఎలవెన్స్ కూడా తీసుకున్నారు అయితే చంద్రబాబు 2017 నుండి తాను ఉంటున్న కరకట్ట నివాసానికి గానూ లింగమనేనికి అద్దె చెల్లించినట్లు ఎక్కడా బ్యాంకు లావాదేవీలు లేవు. చంద్రబాబు నుండి తీసుకున్న అద్దెకు లింగమనేని ఎక్కడా జీఎస్టీ చెల్లించినట్లు కూడా లేదు. దీన్ని బట్టి క్విడ్ ప్రోకో భాగంగానే కరకట్ట నివాసాన్ని చంద్రబాబుకు లింగమనేని రమేష్ ఇచ్చారనేది సీఐడీ వాదన. ఈ అంశంపై లింగమనేని రమేష్ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. తాను దేశ భక్తితోనే కరకట్ట నివాసాన్ని అప్పటి ప్రభుత్వం వాడుకునేందుకు ఉచితంగా ఇచ్చానని న్యాయస్థానానికి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఇంటిని ఉచితంగా ఇస్తే చంద్రబాబు ప్రజా ధనం నుండి ఇంటి అద్దె అలవెన్స్ ను ఎందుకు తీసుకుంటున్నారు అనే సిట్ ప్రశ్నకు సమాధానం లేదు. లింగమనేని ప్రభుత్వానికి ఉచితంగా నివాసాన్ని ఇచ్చి ఉంటే చంద్రబాబు సీఎం పదవి నుండి దిగిపోగానే ఆ ఇంటిని ఖాళీ చేసి ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంటుంది. కానీ అలా జరగలేదు. దీంతో క్విడ్ ప్రోకోలో భాగంగానే చంద్రబాబుకు లింగమనేని కరకట్ట నివాసాన్ని ఇచ్చారనేది సుస్పష్టం అవుతోంది.
గోదావరి జిల్లాల్లో వైసీపీకి సై అంటే సై అన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్