మహారాష్ట్ర లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 25 మంది సజీవ దహనం అయ్యారు. మరో ఎనిమిది మంది గాయాలతో బయటపడ్డారు. మహరాష్ట్ర లోని బుల్దానాలోని సమృద్ది మార్గ ఎక్స్ ప్రెస్ హైవేపై వేకువ జామున ఈ ఘటన జరిగింది. యావత్కాల్ నుండి పూణె కు 32 మంది తో వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రయాణీకులు అందరూ గాఢ నిద్రలో ఉండగా బస్సు టైరు పేలిపోయి పల్టీ కొట్టింది. దీంతో బస్సులో నుండి హాఠాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రయాణీకులు మేల్కొనేలోపే క్షణాల్లో బస్సులోని ప్రయాణీకులు అగ్నికీలలకు బలయ్యారు. కొద్ది మంది ప్రయాణీకులు బస్సు వెనుక అద్దం పగులగొట్టి బయటపడ్డారు.
ప్రమాదం జరిగిన కొద్ది సేపటికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యింది. బస్సు ప్రమాదంలో గాయపడిన ఎనిమిది మంది పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు అయిదు లక్షల రూపాయల పరిహారం ఇస్తామని మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ శిండే శనివారఁ ఉదయం ప్రకటించారు. మహారాష్ట్ర ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ కింద రూ.2లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50వేల వంతున సాయం ప్రకటించారు.
గోదావరి జిల్లాల్లో వైసీపీకి సై అంటే సై అన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్