Tirumala: తిరుమల అలిపిరి కాలిబాటలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఇవేళ తెల్లవారుజామున మరో చిరుత బోనులో చిక్కింది. అటవీ శాఖ అధికారుల ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కింది. గత వారం చిరుత దాడిలో ఆరేళ్ల బాలిక లక్షిత మృతి చెందిన తర్వాత అటవీ శాఖ అధికారులు చిరుతల కట్టడికి బోనులు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఘటన జరిగిన రెండో రోజు ఓ చిరుత బోనులో చిక్కుకోగా ఇవేళ మరో చిరుత బోనులో చిక్కింది. 50 రోజుల వ్యవధిలో మూడు చిరుతలను అధికారులు బంధించడం గమనార్హం.
కాగా చిరుత బోనులో చిక్కిన ప్రదేశాన్ని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి పరిశీలించారు. బోనులో చిక్కిన మగ చిరుత కు దాదాపు అయిదేళ్ల వయస్సు ఉంటుందని తెలిపారు. మరో వైపు అలిపిరి నడక మార్గంలో భక్తులకు కర్రల పంపిణీ పై సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ ను చైర్మన్ భూమన ఖండించారు. అటవీ శాఖ అధికారుల సూచనల మేరకే కర్రలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. కర్రలు ఇచ్చి టీటీడీ బాధ్యతలను తప్పించుకుంటుందని ట్రోల్స్ చేయడం సమంజసం కాదని అన్నారు. భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆపరేషన్ చిరుతను కొనసాగిస్తామని, మరిన్ని చిరుతలు బంధించేలా కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు.
కాగా శేషాచలం అడవుల్లో దాదాపు 40 కి పైగా చిరుతలు సంచరిస్తున్నట్లుగా అటవీ శాఖ అధికారులు అంచనా వేశారు. వీటిలో దాదాపు పది చిరుతలు గుడికి వెళ్లే మెట్ల దగ్గరకు వస్తున్నాయి. చిన్నారిని టార్గెట్ చేయడంతో అటవీ శాఖ అప్రమత్తమైంది. మెట్ల దారికి ఇరువైపులా కెమెరా ట్రాప్ లు ఏర్పాటు చేసారు. చిరుతల కలదలికలు గుర్తించేందుకు దాదాపు 500 కెమెరాలను వినియోగించారు. మెట్ల దారికి సమీపంలో చిరుతల సంచారం ఉండటంతో వాటిని బంధించేందుకు బోనులను ఏర్పాటు చేశారు.
YSRCP: బాపట్ల జిల్లా నాయకులతో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి సమావేశాలు .. ఆ విషయాలపై ఆరా