ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరి గురువారం బాధ్యతలు స్వీకరించారు. విజయవాడ లోని బీజేపీ కార్యాలయంలో ఏపి నూతన అధ్యక్షురాలిగా పురందేశ్వరి బాధ్యతలు చేపట్టారు. తొలుత హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న పురందేశ్వరికి ఆ పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, పార్టీ మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు తదితరుల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు గజమాలో స్వాగతం పలికారు. అనంతరం గన్నవరం విమానాశ్రయం నుండి భారీ ర్యాలీగా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.
పార్టీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడారు. తొలుత రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిగా నియమించిన పార్టీ అధిష్టానానికి ధన్యవాదాలు తెలియజేసిన పురందేశ్వరి .. జగన్మోహనరెడ్డి సర్కార్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కేంద్రం సహకారంతో రాష్ట్రంలో జాతీయ రహదారులు అభివృద్ధి చెందాయన్నారు. జాతీయ రహదారులు 8623 కిలో మీటర్ల నిర్మాణానికి లక్షా 15వేల కోట్లు కేంద్రం కేటాయించిందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ రహదారులు వేసిందో సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ప్రజలందరికీ తెలుసునన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం రెండేళ్లలోనే జాతీయ విద్యా సంస్థలన్నీ కేంద్రం ఏపీలో నిర్మించిందన్నారు. విమానాశ్రయాల విస్తరణను కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే ఏపిలో అభివృద్ధి జరిగిందన్నారు.
విజయవాడ ఎయిర్ పోర్టు విస్తరణ, పలు ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ఇచ్చినట్లు తెలిపారు. ఎన్ఆర్ జీపీ కింద 2022 – 23 వరకూ 8వేల కోట్లకు పైగా నిధులు వచ్చాయన్నారు. రాష్ట్రంలో 90 లక్షల మందికి ఉచిత బియ్యం అందుతోందని తెలిపారు. ఈ ఏడాది బియ్యం ద్వారా పది వేల కోట్లకు పైగా రాష్ట్రానికి అందిందని తెలిపారు. రైల్వేలో 72 స్టేషన్ల అభివృద్ధికి కేంద్రమే సహాయ సహకారాలు అందించిందన్నారు. ఏపి ప్రభుత్వం సహకరిస్తే అన్ని అభివృద్ధి చెందుతాయని లేకుంటే పెండింగ్ లో ఉన్నవి పెండింగ్ లోనే ఉండిపోతాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది రాష్ట్రానికి రూ.46,836 కోట్లు గ్రాంట్లు ద్వారా అందిస్తుందన్నారు. గ్రామాల అభివృద్ధికి కేంద్రం నేరుగా సర్పంచ్ ల ఖాతాలలోకి నిధులు విడుదల చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా పక్కదారి పట్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఎన్నికల ముందు ప్రతి రైతుకు రూ.12వేల ఇస్తామన్నారనీ, దానిరపై సీఎం సమాధానం చెప్పాలన్నారు. కేంద్రం ఇస్తున్న రూ.6వేలు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. ఇది రైతులను మోసం చేయజడం కాదా అని అన్నారు.
పోలవరం ను కేంద్రానికి అప్పగించండి
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్రం జాప్యం చేయడం లేదనీ, ఇటీవలే రూ.12 వేల కోట్లు కేంద్రం ఇచ్చిన విషయాన్ని పురందేశ్వరి గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు మీరు కట్టకుంటే కేంద్రానికి అప్పచెప్పాలన్నారు. పోలవరం విషయంలో కేంద్రం ఎప్పుడూ వెనుకడుగు వేయలేదని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అని ప్రశ్నించారు. మహిలకు రక్షణ కల్పించలేని పరిస్థితు ల్లో ఏపి ప్రభుత్వం ఉందని విమర్శించారు. విశాఖలో ఎంపీ కుటుంబానికి రక్షణ లేదన్నారు. నాసిరకం మద్యం ను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తొందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో చిన్న చిన్న కాంట్రాక్టర్ కు ఇప్పటి దాకా బిల్లులు చెల్లించలేదని అన్నారు. మైనింగ్ వ్యాపారులపై దాడులు చేయించి తమకు అనుకూలమైన వారికి ఇప్పించుకుంటూ దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇసుక మాఫియా రాష్ట్రంలో నడుస్తొందని అన్నారు. విశాఖలో కడప నుండి వచ్చిన వాళ్లు బెదిరించి ఓ వ్యక్తి ల్యాండ్ కబ్జా చేస్తే బాధితుడు కోర్టుకు వెళ్లి గెలిచి తన ల్యాండ్ గెలుచుకున్నారని అన్నారు. ఇలా ప్రభుత్వంపై పురందేశ్వరి విమర్శలు గుప్పించారు.