ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తన మకాం విశాఖ కు షిప్ట్ చేసి అక్కడి నుండే పరిపాలన చేయాలని ఎప్పటి నుండో భావిస్తున్నారు. మూడు రాజధానుల అంశాన్ని అత్యవసర విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం పలు మార్లు కోరినప్పటికీ సుప్రీం కోర్టులో వాయిదాల మీద వాయిదా పడుతూ ఉంది. డిసెంబర్ నెలలో విచారణ చేపడతామని సుప్రీం కోర్టు ఇటీవల చెప్పింది. సుప్రీం కోర్టులో ఆ వ్యవహారం తేలకపోయినప్పటికీ తన అధికారిక నివాసం విశాఖకు మార్పు చేసి అక్కడ నుండి పరిపాలన చేయాలని సీఎం కృతనిశ్చయంతో ఉన్నారు. సెప్టెంబర్ నుండి విశాఖలోనే ఉంటాననీ, పరిపాలనా వికేందగ్రీకరణలో భాగంగానే విశాఖకు వస్తున్నట్లుగా గతంలోనే సీఎం జగన్ ప్రకటించారు.
ఈ క్రమంలోనే రుషికొండ సమీపంలో సీఎం అధికారిక భావన నిర్మాణ పనులు పూర్తి చేశారు. అయితే సెప్టెంబర్ నెలలో విశాఖకు షిప్ట్ అవుతామని చెప్పినప్పటికీ మరో నెల ఆలస్యం అవుతుందని సమాచారం. ఇప్పటికే సీఎం అధికారిక భవన నిర్మాణ పనులు దాదాపు పూర్తి కాగా ఇంటీరియర్ పనులు జరుగుతున్నాయి. అక్టోబర్ మూడవ వారంలోగా భవనం పూర్తి స్థాయిలో రెడీ అవుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవేళ భద్రతా సిబ్బంది మరియు సీఎంఓ సీబ్బంది భవనాన్ని పరిశీలన చేసేందుకు వెళతున్నారు. అక్టోబర్ 24 నాటికి ఆ భవనంలోకి మకాం మార్చి పరిపాలన చేస్తారని అంటున్నారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల కన్సెప్ట్ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.
అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, విశాఖను పరిపాలనా రాజధానిగా సీఎం జగన్ ప్రకటించారు. అయితే ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు రాజధానుల బిల్లులో సాంకేతిక లోపాలు ఉండటంతో హైకోర్టులో కేసు నడుస్తుండగానే ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకుంది. ఆ తర్వాత ఏపీ హైకోర్టు అమరావతిలోనే రాజధాని అభివృద్ధి పనులు కొనసాగించాలని తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ఏపి సర్కార్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఆరు నెలల్లో పనులు పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చింది. మూడు రాజధానుల ఏర్పాటు, రాజధాని మార్పు అంశం రాష్ట్ర అసెంబ్లీ చేయవచ్చా చేయకూడదా అనే అంశంపై సుప్రీం కోర్టులో విచారణ అనంతరమే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇది ఇంకా జాప్యం అవుతున్న నేపథ్యంలో తాను అన్న మాటకు కట్టుబడి ఉన్నానని ఉత్తరాంధ్ర ప్రజల్లో కాన్ఫిడెన్స్ కల్గించేందుకు సీఎం జగన్ తన మకాంను విశాఖకు మార్పు చేసి అక్కడి నుండి పరిపాలన చేయాలని డిసైడ్ అవుతున్నారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 24 తేదీని మూహూర్తంగా ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తొంది.