వైసీపీ అధినేత, ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి గత కొద్ది రోజులుగా నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో భేటీ లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా ఇవేళ శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ వైసీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజా ప్రభుత్వంగా పేరు దక్కించుకున్నామని పేర్కొన్న సీఎం వైఎస్ జగన్.. రాబోయే ఎన్నికల్లో వైసీపీ స్పీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు మరో 18 నెలల సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే సన్నద్దం కాావాలనీ, క్షేత్ర స్థాయిలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి ప్రజలకు వివరించడం ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తామని చెప్పారు.
ఈ మూడు సంవత్సరాల నాలుగు నెలల్లో ఒక్క టెక్కలి నియోజకవర్గంలోనే అక్షరాాలా రూ.1026 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా లబ్దిదారులకు అందించామని అన్నారు. గతానికి భిన్నంగా అర్హులందరికీ మేలు చేశామని వివరించారు. నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకుంటే 87 శాతం ఇళ్లకు మంచి చేశామనీ, ఆ మంచి జరిగిన ఇళ్లలోని వారు మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు ఎందుకు మనం 175కు 175 సాధించలేమని మనం గుండెల మీద చేయి వేసుకుని ప్రశ్నించుకోవాలన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధ సంక్షేమ కార్యక్రమాలను వివరించిన సీఎం జగన్… నేతలను ఉద్దేశించి ఏమైనా చిన్న చిన్న గొడవలు ఉన్నా అవి పక్కన పెట్టి ముందుకు సాగాలన్నారు. రేపు ఎన్నికల్లో మనం గెలిస్తే వచ్చే 30 ఏళ్లూ మనమే అధికారంలో ఉంటామనీ, ఇవాళ మనం చేసిన కార్యక్రమాలన్నీ కూడా వచ్చే కాలంలో మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, టెక్కలి నియోజకవర్గ నేతలు పాల్గొన్నారు.