AP CMO: సీఎంవో కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చిన ప్రవీణ్ ప్రకాష్ బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఆయనను ప్రభుత్వం ఢిల్లీ ఏపి భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శిగా ఎవరు నియామకం అవుతారన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. ప్రవీణ్ ప్రకాష్ స్థానంలో మరో సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించే అవకాశం ఉన్నందున ఆ అధికారి ఎవరు అన్న చర్చ సచివాలయ వర్గాల్లో నెలకొంది.
AP CMO: ప్రవీణ్ ప్రకాష్ స్థానంలో..
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహనరెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టి మూడేళ్లు అవుతోంది. ఇప్పటి వరకూ సీఎం జగన్ పూర్తి స్థాయిలో అధికారులపైనే ఆధారపడ్డారు. దీంతో వారు లీగల్ ఒపీనియన్ లు తీసుకోకుండా ఇష్టానుసారంగా జారీ చేసిన అనేక ప్రభుత్వ ఉత్తర్వులు వివాదాస్పదం అయ్యాయి. న్యాయసమీక్షలో నిలవలేదు. హైకోర్టు అనేక ఉత్తర్వులను కొట్టేసింది. ఇది ఒక విధంగా ప్రభుత్వానికి మచ్చగానే నిలుస్తోంది. సాధారణంగా ఇటువంటి వ్యవహారాలు సీఏంఒ కార్యదర్శి చూసుకోవాలి. అందుకే ఇప్పటి వరకూ జరిగిన తప్పులు జరగకుండా ప్రవీణ్ ప్రకాష్ స్థానంలో సమర్ధవంతమైన మరో సీనియర్ ఐఏఎస్ అధికారిని ఆ పోస్టులో నియమించాలని సీఎం జగన్ భావిస్తున్నారని సమాచారం.
టీటీడీ ఈఓ జవహర్ రెడ్డి కే చాన్స్..?
ఈ రెండున్నర సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వానికి కీలకం. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు విమర్శల పాలు కాకుండా చూసుకోవాలి. ఈ తరుణంగా సీఎంవో కార్యదర్శి పదవికి ప్రస్తుతం టీటీడీ ఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న జవహర్ రెడ్డి పేరు పరిశీలిస్తున్నారని సమాచారం. మరో సీనియర్ అధికారిణి శ్రీలక్ష్మి పేరు కూడా పరిశీలనకు వచ్చినా ఆమెను నియమిస్తే రాజకీయపరమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని భావిస్తున్నారుట. ప్రస్తుతం సచివాలయ వర్గాల్లో మాత్రం జవహర్ రెడ్డి పేరు వినబడుతోంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.