మాజీ మంత్రి వట్టి వసంత కుమార్ కన్నుమూశారు. వట్టి వసంత కుమార్ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. విశాఖ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవేళ ఉదయం తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్ కుమార్ హయాంలో వట్టి వసంత కుమార్ గ్రామీణాభివృద్ధి, పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. వట్టి వసంత కుమార్ స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా వూళ్ల గ్రామం. ఆయన ఉంగుటూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు. వసంత కుమార్ భౌతకకాయాన్ని ఆయన స్వగ్రామం తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
కాగా వట్టి వసంత కుమార్ 2014 ఎన్నికలకు ముందు టీడీపీ, కాంగ్రెస్ కలయికతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. 2014 నుండి కాంగ్రెస్ పార్టీతో పాటు రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. గతంలో ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ కావడంతో ఆ పార్టీ లో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను ఆయన ఖండించారు. పవన్ కళ్యాణ్ తో రాజకీయాలు ఏమీ చర్చించలేదనీ, మర్యాదపూర్వకంగానే తను కలిసినట్లు నాడు పేర్కొన్నారు.
వసంత కుమార్ మరణంతో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అపోలో ఆసుపత్రి వద్దకు పెద్ద ఎత్తున ఆయన అనుచరులు చేరుకుంటున్నారు. వసంత్ కుమార్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ ముఖ్యనేతలు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఇవేళ సాయంత్రం తమ స్వగ్రామంలో అంత్యక్రియలు జరగనున్నట్లు వసంత కుమార్ కుటుంబ సభ్యులు మీడియాకు తెలిపారు.
YS Viveka Murder Case: మొదటి సారి సీబీఐ విచారణ ఎదుర్కొన్న ఎంపీ అవినాష్ రెడ్డి ఏమన్నారంటే..?