AP GOVERNMENT : డిగ్రీ పట్టాలు కేవలం గోడకు తగిలించి పోవడానికి, గొప్పలు చెప్పుకోవడానికి మాత్రమే పనికొచ్చే రోజులివి. డిగ్రీ చదివిన వారు అంటే గతంలో ఒక రకమైన హుందా, గౌరవం ఉండేది. ఉద్యోగాలు వరుస కట్టేవి. అయితే రానురాను డిగ్రీ చదువు కేవలం సర్టిఫికెట్ కోసం, పేరు కోసం తప్ప ఇంకెందుకు పనికిరావు అనేలా తయారైయింది. ఇప్పుడు ఈ చదువులు నాణ్యత పెంచేందుకు, డిగ్రీ చదవగానే ఒక మంచి ఉద్యోగం లభించేందుకు అనువైన వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కల్పించేందుకు ఒక అడుగు ముందుకు వేసింది.
గతంలో డిగ్రీ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు సంవత్సరాంతం పరీక్షలను ఎవరికి వారే ప్రశ్నపత్రాలు రూపొందించుకునే వారు. ఒక అటానమస్ కాలేజ్ ( స్వయం ప్రతిపత్తి కళాశాల ) పరిధిలోని మిగతా కళాశాలలకు అదే ప్రశ్నాపత్రం వెళ్ళేది. డిగ్రీ మూడు సంవత్సరాలు, ఇంజనీరింగ్ నాలుగు సంవత్సరాలు చదువు ఉంటాయి. ఒక ఏడాది అన్ని సబ్జెక్టులు పూర్తి చేయక పోయినా, ఆ తరగతి నుంచి ప్రమోట్ అయ్యేందుకు, ఫెయిల్ అయిన సబ్జెక్టును తర్వాత పూర్తి చేసేందుకు అవకాశం ఉండేది.దీంతో ఎవరికి వారు ప్రశ్నాపత్రం రూపొందించుకోవడం, దారిలో కొన్ని అవకతవకలకు అవకాశం ఉండేది. దీంతో నాణ్యమైన విద్య, పరీక్ష విధానం ఉండేది కాదు. ఎవరికి వారు తమ విద్యార్థులకు పరీక్షా పత్రం రూపొందించుకునే వీలు ఉండడంతో, తమ విద్యా సంస్థ పరువు పోకూడదు అనే కోణంలో సాధ్యమైనంతగా విద్యార్థులను ఉత్తీర్ణ చేయడానికి ప్రయత్నించారు. దీంతో విద్యార్థులు అంతంత మాత్రంగానే విజ్ఞాన వంతులుగా బయటకు వచ్చేవారు.
డిగ్రీ చదువుకున్న వారికి 1990 దశకం వరకు మంచి ఉద్యోగాలు లభించేవి. ప్రభుత్వ ఉద్యోగాల్లో నూ వారి హవా వుండేది. ప్రైవేటు కొలువుల్లో ను వారికి మంచి ప్రాధాన్యం లభించేది. తర్వాత వచ్చిన విద్యావిధానంలో మార్పులు తో పాటు విద్యా సంస్థలు ఎక్కువవడంతో ఎక్కువ డిగ్రీలు తక్కువ నాణ్యత అనేలా చదువులు తయారయ్యాయి. దీనికితోడు రాష్ట్రంలో ఉన్న పద్దెనిమిది అటానమస్ కాలేజీలు, 64 వరకు ఇంజనీరింగ్ అటానమస్ కాలేజీలు ఎవరికి వారే తమ పరిధిలో ఉన్న కళాశాలలకు ప్రశ్నాపత్రం తయారు చేసుకునే వెసులుబాటు ఉండడంతో విద్యార్థులు ఉత్తీర్ణత చేయడమే లక్ష్యంగా పని చేశారు. దీంతో విద్యార్థులను చదువు అంటే నిర్లక్ష్యం, డిగ్రీలు అంటే ఒక విధమైన చిన్నచూపు సమాజంలో ఏర్పడింది. కాస్త ఒత్తిడి మరికాస్త డబ్బు చూపితే సులభంగా డిగ్రీ పూర్తి చేయవచ్చని భావన చాలా చోట్ల ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం దీనిని మార్చేందుకు ఒక రకమైన ముందడుగు వేసింది అనే చెప్పాలి. ఎవరికి వారు ప్రశ్నాపత్రం రూపొందించుకొని, విద్యార్థులను తమ ఇష్టానుసారం ఉత్తీర్ణత చేయించుకోవడానికి అవకాశం ఉండదు. జేఎన్టీయూ పరిధిలో అన్నీ కళాశాలలు ఉండే అవకాశం ఉండటంతో అక్కడి నుంచే ప్రశ్నాపత్రం వస్తుంది. దీంతో విద్యార్థులు పూర్తి జాగ్రత్తతో, చదువుపై ఇష్టంతో పరీక్షల భయంతో చదివే అవకాశం ఉంటుంది. ఇది క్రమంగా చదువులో నాణ్యత పెంచేందుకు, విద్యార్థులకు నైతిక బలం పెంచేందుకు ఉపయోగపడుతుంది. ఇప్పటికిప్పుడే మొత్తం చదువు లేని మారిపోతాయని చెప్పలేము కానీ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఖచ్చితంగా ప్రభావం చూపుతుందని మాత్రం చెప్పాలి. ఇప్పటి వరకు ఒక పద్ధతి లేకుండా సాగుతున్న చదువులకు ఇది ఒక రకమైన క్రమశిక్షణే..