ఏపి రాజధాని అమరావతి పరిధిలో జగన్ సర్కార్ మరో కీలక ప్రతిపాదన చేసింది. ఇంతకు ముందు రాజధాని పరిధిలోని 19 గ్రామాలతో అమరావతి మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటునకు ప్రతిపాదన చేసి గ్రామ సభలను నిర్వహించగా ఆయా గ్రామాలు తిరస్కరించాయి. సీఆర్డీఏ పరిధిలోని 29 గ్రామాలతో కూడిన కార్పోరేషన్ ఏర్పాటు చేయాలంటూ ఏకగ్రీవ తీర్మానాలు చేశారు. అయితే ప్రభుత్వం ఈ తీర్మానాన్ని పక్కన పెట్టి, తాజాగా తుళ్లూరు, మంగళగిరి మండలాల్లోని 22 గ్రామ పంచాయతీలతో అమరావతి మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటునకు కసరత్తు ప్రారంభించింది.
Read More: లోన్ యాప్ ఆగడాలపై ఏపీ సీఎం జగన్ సీరియస్ .. కీలక ఆదేశాలు
ఈ మేరకు ఆయా గ్రామాల్లో గ్రామ సభలను నిర్వహించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ గుంటూరు జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. తుళ్లూరు మండలంలోని 19 గ్రామాలు, మంగళగిరి మండలంలోని మూడు గ్రామాలతో అమరావతి మున్సిపాలిటీ ఏర్పాటు చేయనున్నట్లు నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులు అందుకున్న పది రోజుల్లో అభ్యంతరాల ప్రక్రియ పూర్తి చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశించారు. నిర్దేశించిన గడువులోగా సమాధానం ఇవ్వకపోతే అమరావతి మున్సిపాలిటీకి ఆమోదం తెలిపినట్లుగానే పరిగణిస్తామని పేర్కొన్నారు. తాజాగా మున్సిపాలిటికి ప్రకటించిన జాబితాలో తుళ్లూరు మండలంలోని పెదపరిమి, వడ్లమాను, హరిశ్చంద్రాపురం గ్రామాలను చేర్చారు.
రాజధానికి భూములు తీసుకున్నప్పుడు చేసుకున్న ఒప్పందం ప్రకారం 29 గ్రామాలను కలిపి అమరావతి రాజధాని స్మార్ట్ సిటీని ఏర్పాటు చేయాలని ఆ గ్రామాల రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతుల డిమాండ్ ఈ విధంగా ఉండగా ప్రభుత్వం మాత్రం 22 గ్రామాలతో మున్సిపాలిటీ ఏర్పాటునకు కసరత్తు చేస్తొంది.
Read More: మంత్రులకు సీరియస్గా క్లాస్ పీకిన ఏపి సీఎం వైఎస్ జగన్..ఎందుకంటే..?