అమరావతి రైతుల పాదయాత్రపై పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి అడ్డుకునేందుకు దేవుడు పేరుతో చేస్తున్న దెయ్యాల యాత్రగా మారిందని అన్నారు అమరనాథ్, చంద్రబాబు సృష్టించిన అమరావతి దెయ్యాల రాజధాని అని ఆయన మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా సాగుతున్న ఈ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా దానికి చంద్రబాబు పూర్తి బాధ్యత వహించాలని పునరుద్ఘాటించారు. అమరావతి మినహా ఇతర ప్రాంతాలు అభివృద్ధి చెందాలని వైసీపీ కోరుకోవడం లేదనీ, అమరావతితో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని సీఎం వైఎస్ జగన్ సంకల్పమని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని పరిపాలనా వికేంద్రీకరణ చేస్తొందని చెప్పారు.
“దేశమంటే మట్టికాదోయే దేశమంటే మనుషులోయ్” అని మహాకవి గురజాడ చెప్పారనీ, “రాష్ట్రమంటే 29 గ్రామాలు కాదోయే .. రాష్ట్ర మంటే 26 జిల్లాలోయ్” అని చంద్రబాబు గుర్తెరగాలని అమరనాథ్ హితవు పలికారు. 2024 తో రాజధాని అంశానికి ప్రభుత్వం ముగింపు పలుకుతుందన్నారు. ఇప్పటి వరకూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఎన్నికల్లో రెఫరెండమ్ అవుతాయని, ఆ ఎన్నికల్లో తీర్పు వైసీపీకి అనుకూలంగా వస్తుందని మంత్రి అమరనాథ్ ధీమా వ్యక్తం చేశారు.
అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు మహా పాదయాత్ర నిన్న ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు మంత్రులు, వైసీపీ నేతలు దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర పై జరుగుతున్న దండయాత్రగా వైసీపీ నేతలు అభివర్ణిస్తున్నారు. అమరావతి రైతుల పరిరక్షణ సమితి చేపట్టిన ఈ పాదయాత్రకు తొలుత ప్రభుత్వం అనుమతి మంజూరు చేయలేదు. శాంతి భద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని పేర్కొంటూ పాదయాత్రకు పోలీసు అధికారులు అనుమతిని నిరాకరించారు. అయితే హైకోర్టుకు అనుమతి ఇవ్వడంతో పాదయాత్ర కొనసాగుతోంది.
అమరావతి రైతుల మహాపాదయాత్ర రెండవ రోజు ఇలా..