Breaking: అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ టీడీపీ కీలక నిర్ణయం తీసుకుంది. చంద్రబాబు అరెస్టుపై చర్చించాలంటూ టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో పాటు సభ్యులను వరుసగా సస్పెండ్ చేస్తున్న నేపథ్యంలో దానికి నిరసనగా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ అసెంబ్లీ సెషన్ మొత్తాన్ని బహిష్కరించాలని నిర్ణయం తీసుకుంది టీడీపీ.
ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ తాము వాయిదా తీర్మానాన్ని చాలా క్లారిటీగా ఇచ్చాం. స్పీకర్ గారు ఆ తీర్మానం చదవడానికి కూడా ఇష్టపడలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో రావడం దురదృష్టకరమని భావిస్తున్నాం. ఒక ప్రతిపక్ష పార్టీ వాయిదా తీర్మానం ఇస్తే ఒక అక్షరం పొల్లుపోకుండా చదవాలి. అది స్పీకర్ బాధ్యత. అది కూడా చదవలేదు. తాము ఇచ్చిన వాయిదా తీర్మానం చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు అన్నీ ఎత్తివేయాలి. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి క్షమాపణ చెప్పాలని మేము ఇచ్చాం.
దానికి చర్చిస్తాం రండి అంటున్నారు. శాసనసభలో గత నాలుగు సంవత్సరాలు చర్చలు ఏ విధంగా జరిగాయో..రాష్ట్ర ప్రజలందరూ, పాత్రికేయులు సజీవ సాక్షులు. స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల, స్పీకర్ వైసీపీ సభ్యుడుగా వ్యవహరించడం వల్ల శాసనసభలో అధికారపక్షం వర్షనే వెల్లడి అవుతోంది. శాసనసభలో బాలయ్య విజిల్ వేసేది చూపిస్తారు కానీ మొత్తం శాసనసభలో ఏమి జరుగుతుందో చూపించే ధైర్యం లేదు. శాసనసభలో జరుగుతున్న మొత్తాన్ని ప్రజలకు చూపించడం లేదని తాము సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరిస్తే అదేదో పెద్ద నేరంగా తమను సస్పెండ్ చేశారు.
స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి వాస్తవాలు అన్నీ ఒక రకంగా ఉంటే వాటికి విరుద్దంగా ప్రజలను తప్పుదారి పట్టించేలా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని, ఈ అంశంపై తామే వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు. స్పీకర్ వ్యవహరిస్తున్న ఏకపక్ష వైఖరికి నిరసనగా టీడీపీ శాసనసభ నుండి బాయ్ కాట్ చేసినట్లు అచ్చెన్నాయుడు తెలిపారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిన్న ప్రారంభం అయ్యాయి. అయిదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. చంద్రబాబు అరెస్టు అక్రమం అంటూ ఇచ్చిన వాయిదా తీర్మాన్ని స్పీకర్ తిరస్కరించారు. దీంతో ఆందోళన నేపథ్యంలో నిన్న టీడీపీకి చెందిన సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. ముగ్గురు సభ్యులను సెషన్ ముగిసే వరకూ సస్పెండ్ చేయగా, మిగిలిన సభ్యులను నిన్నటి సెషన్ నుండి సస్పెండ్ చేశారు. ఈ వేళ కూడా అదే పరిస్థితి నెలకొనగా అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్ లను ఈ సెషన్ ముగిసే వరకూ సస్పెంచ్ చేసిన స్పీకర్ .. ఆ తర్వాత మరో ముగ్గురు టీడీపీ సభ్యులను అరెస్టు చేశారు. అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్దం, సవాళ్లు ప్రతిసవాళ్లతో నిన్న అసెంబ్లీ దద్దరిల్లింది. ఇవేళ కూడా విమర్శలు, ప్రతి విమర్శలతో సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది.
Chandrababu Arrest: చంద్రబాబు జ్యూడిషియల్ రిమాండ్ పొడిగింపు