Chandrababu Arrest: టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ను కస్టడీకి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి గురువారం ఉదయం తీర్పు వెలువరిస్తామని ప్రకటించారు. దీంతో తీర్పుపై సర్వాత్రా ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబును అయిదు రోజుల పాటు కస్టడీకి కోరుతూ సీఐడీ తరపున అదనపు అడ్వొకేటే జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. చంద్రబాబును కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన తరపున సీనియర్ సుప్రీం కోర్టు న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్ధ్ అగర్వాల్ లు వాదనలు వినిపించారు. ఇరుపక్షాల మధ్య వాదనలు వాడివేడిగా జరిగాయి.
చంద్రబాబును అన్ని ఆధారాలతోనే అరెస్టు చేశారని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరినీ మరింత విచారించాల్సి ఉందనీ, కేసులో రికవరీ కంటే కుట్ర కోణాన్ని వెలికితీయడం ముఖ్యమని ఏఏసీ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. చంద్రబాబును మరో సారి విచారిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో రూ.371 కోట్ల దుర్వినియోగంపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయనీ, నిధులు ఎక్కడెక్కడికి వెళ్లాయో సమాచారం ఉందనీ, కేసులో ఇంకా పూర్తి వివరాలు రాబట్టాల్సి ఉందని అన్నారు. సీఐడీ విచారణలో అసలు విషయం బయటపడుతుందన్న భయంతోనే కస్టడీ అడ్డుకుంటున్నారంటూ సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు.
చంద్రబాబు తరపున న్యాయవాదులు సిద్ధార్థ్ లూథ్రా, సిద్దార్ద్ అగర్వాల్ లు వాదనలు వినిపించారు. చంద్రబాబును కోర్టులో హజరుపర్చిన సెప్టెంబర్ 10న సీఐడీ కస్టడీ కోరలేదని, మరుసటి రోజు సెప్టెంబర్ 11న కస్టడీ కోరుతూ మెమో ఎలా దాఖలు చేస్తారని కోర్టు దృష్టికి తెచ్చారు. 24 గంటల్లో దర్యాప్తు అధికారి నిర్ణయం మార్చుకున్నారని తెలిపారు. పాత అంశాలతో కస్టడీకి ఎలా కోరతారని ప్రశ్నించారు. అరెస్టు ప్రక్రియ నిబంధనలకు విరుద్దంగా జరిగిందన్నారు. చంద్రబాబు అవినీతి చేసినట్లు ఎక్కడా ఆధారాలు లేవనీ..నాలుగేళ్లుగా ఎవరిని అరెస్టు చేసినా నిధుల దుర్వినియోగం పేరు చెబుతున్నారని పేర్కొన్నారు.
చంద్రబాబును అరెస్టు చేసి విచారణ పేరుతో సీఐడీ ఆఫీసులో ఉంచారని, కొన్ని గంటల పాటు చంద్రబాబును విచారించారన్నారు. ఆయన నుండి అన్ని విషయాలు రాబట్టామని చెప్పి మళ్లీ కస్టడీకి ఎందుకు అడుగుతున్నారని ప్రశ్నించారు. దర్యాప్తు విషయాలపై సీఐడీ మీడియా సమావేశాలు ఎలా పెడుతుందని ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టు రాజకీయ కుట్రతోనే జరిగిందని, విచారణలో కొత్త కోణం కోర్టు ముందు పెట్టలేకపోయారనీ చంద్రబాబు తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తమ నిర్ణయాన్ని గురువారానికి వాయిదా వేశారు.
YS Viveka Case: వివేకా కేసులో వైఎస్ భాస్కరరెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు