YS Viveka Case: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు వైఎస్ భాస్కరరెడ్డికి మధ్యంతర బెయిల్ లభించింది. 12 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైదరాబాద్ సీబీఐ కోర్టు ఇవేళ తీర్పు ఇచ్చింది. ఎస్కార్ట్ వాహనంలోనే బాస్కరరెడ్డిని తరలించాలని ఆదేశించింది. అనారోగ్య సమస్యల కారణంగా 15 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని భాస్కరరెడ్డి కోర్టును ఆశ్రయించారు. గత వారంలో సీబీఐ కోర్టు ఇరువైపులా వాదనలు విన్నది. అయితే అనారోగ్యం కారణంగా బెయిల్ ఇవ్వాల్సిన అవసరం లేదనీ, చంచల్ గూడ జైలులో భాస్కరరెడ్డికి తగిన వైద్య చికిత్స అందిస్తున్నామని సీబీఐ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
భాస్కరరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై చంచల్ గూడ జైలు అధికారులు న్యాయస్థానానికి నివేదిక సమర్పించారు. నివేదిక పరిశీలించిన సీబీఐ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇవేళ మధ్యంతర బెయిల్ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే 15 రోజుల పాటు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరగా, కోర్టు 12 రోజుల పాటు పోలీస్ బందోబస్తుతోనే సీబీఐ కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సెప్టెంబర్ 22 నుండి వచ్చే నెల 3వ తేదీ వరకూ 12 రోజుల పాటు ఎస్కార్ట్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. హైదరాబాద్ విడిచి వెళ్లరాదని ఆదేశించింది. వివేకా కేసులో భాస్కరరెడ్డి ఏ5 నిందితుడుగా ఉన్నారు.
ఇదే కేసులో మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర రెడ్డి కి సీబీఐ కోర్టులో చుక్కెదురైంది. వివేకా హత్య కేసులో ఏ 5 నిందితుడుగా ఉన్న శివశంకరరెడ్డి తనకు బెయిల్ మంజూరు చేయాలని సీబీఐ కోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం అందుకు నిరాకరించింది. శివశంకర రెడ్డి బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. శివశంకర రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ నిన్న తీర్పు ఇవ్వడంతో వైఎస్ భాస్కరరెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్ పై కోర్టు ఎటువంటి నిర్ణయం ప్రకటిస్తుంది అన్నదానిపై సస్పెన్స్ నెలకొంది. ఇవేళ భాస్కరరెడ్డికి మధ్యంతర మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
వైఎస్ భాస్కరరెడ్డి.. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి. ఈ కేసులో నిందితుడుగా ఉన్న వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు గతంలోనే ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వైఎస్ వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించింది. గత సోమవారం ఆ పిటిషన్ విచారణకు రాగా పిటిషన్ దారు సునీత వాయిదా కోరారు. దీంతో సుప్రీం కోర్టు మూడు వారాలు వాయిదా వేసింది.