Chandrababu Arrest: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో ఈ నెల 27 (గురువారం) విచారణ జరగనుంది. బెయిల్ పిటిషన్ పై దసరా వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టనుంది. చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఈ నెల 19న హైకోర్టులో వాదనలు జరిగాయి. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా హైకోర్టును కోరారు.
ఈ కేసులో ఇంతర నిందితులు ఇప్పటికే బెయిల్ పై ఉన్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. గడచిన 40 రోజులుగా దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేదని పేర్కొన్నారు. బెయిల్ పిటిషన్ పై విచారణను వెకేషన్ బెంచ్ కు బదిలీ చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు న్యాయస్థానాన్ని అభ్యర్ధించగా, న్యాయస్థానం వారి అభ్యర్ధనను అంగీకరించింది. బెయిల్ పిటిషన్ పై విచారణను వెకేషన్ బెంచ్ కు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
తొలుత చంద్రబాబు బెయిల్ కోసం ఏసీబీ కోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం బెయిల్ మంజూరును తిరస్కరించింది. దీంతో చంద్రబాబు తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును గత నెల 9వ తేదీన సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. ఆ మరుసటి రోజు ఏసీబీ కోర్టులో చంద్రబాబును హజరుపర్చాగా రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైల్ కు తరలించారు.
గత 45 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్ లోనే ఉన్నారు. 27వ తేదీ హైకోర్టు వెకేషన్ బెంచ్ చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే కేసులో చంద్రబాబు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై నవంబర్ 8వ తేదీన తీర్పు రానున్నది.
Amit Shah – Pawan Kalyan: అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ.. పొత్తులపై స్పష్టత వస్తున్నట్లే..!