Undavalli Arun Kumar: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పరిస్థితులు రోజురోజుకు మారుతున్నాయి. ఓ పక్క వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పలు నియోజకవర్గాల్లో ఇన్ చార్జిల మార్పుపై దృష్టి పెట్టారు. పలువురు మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో జగన్ కఠినంగా వ్యవహరిస్తున్నారు. కొందరి స్థానాలను మార్పు చేస్తుండగా, మరి కొందరిని పక్కన పెడుతున్నారు.
మరో పక్క టీడీపీ – జనసేన ఉమ్మడి కార్యచరణకు సన్నద్దం అయ్యింది. ఇదే సమయంలో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ జై భారత్ నేషనల్ పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పరిస్థితులపై మాజీ ఎంపీ, రాజకీయ విశ్లేషకుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో అనేక మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెడుతున్నారనే వార్తలపై ఆయన మాట్లాడుతూ ప్రస్తుత రాజకీయాల్లో త్యాగాలు చేయడానికి ఎవరూ రారనీ, సీటు లేదని చెప్పాలంటే దానికి చాలా అనుభవం ఉండాలన్నారు. అటువంటి అనుభవం జగన్మోహనరెడ్డికి ఉందని తాను అనుకోవడం లేదన్నారు.
టికెట్లు మార్చే ప్రక్రియ సరికాదని అన్నారు ఉండవల్లి. తెలంగాణలో సిట్టింగ్ లను మార్చకపోవడం వల్ల అక్కడ కేసిఆర్ ఓడిపోయారనీ, ఇక్కడ సిట్టింగ్ లను మారిస్తే జగన్ గెలుస్తారని అనుకోవడం సరికాదని అన్నారు. ఏపీలో ఎమ్మెల్యేలకు ఎక్కడా అధికారం లేదనీ, అధికారం అంతా జగన్మోహనరెడ్డి, వాలంటీర్ల చేతిల్లో మాత్రమే ఉందని అన్నారు. దేశంలోనే జగన్మోహనరెడ్డి గొప్ప ప్రయోగం చేశారనీ, అప్పులు చేసి సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పంచడం ఎక్కడా చూడలేదని అన్నారు.
ఇక జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ పార్టీపై ఉండవల్లి మాట్లాడుతూ .. జేడీ పార్టీ పెట్టడం వల్ల సీట్లు సాధించకపోవచ్చు కానీ ఓట్లు ఎంత శాతం సంపాదిస్తుంది అనేది రాజకీయ పరిణామాలు మారడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. చంద్రబాబు, జగన్మోహనరెడ్డి నిజాయితీగా పార్టీని నడపడం రాక కాదనీ, నడపడం వల్ల పయోజనం లేకనేనని అన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలవడం వల్ల వాళ్లకు బలమే అవుతుందని అన్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రభావంతో ఏపీలోనూ కాంగ్రెస్ పుంజుకుంటుందని ఉండవల్లి అశాభావం వ్యక్తం చేశారు.
NRI TDP: గుంటూరు సీఐడీ కార్యాలయానికి ఎన్ఆర్ఐ యాష్ .. 41ఏ నోటీసులు అందజేత