NRI TDP: టీడీపీ ఎన్ఆర్ఐ నేత బొద్దులూరి యశస్వి (యాష్) ను ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని పరామర్శించేందుకు వచ్చిన ఆయనను శంషాబాద్ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకుని గుంటూరు సీఐడీ కార్యాలయానికి తరలించారు.
వైసీపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు గానూ ఆయనపై కేసు నమోదు అయి ఉంది. యాష్ మీద కేసులు పెండింగ్ లో ఉండటంతో తీసుకువచ్చినట్లుగా సీఐడీ పోలీసులు చెబుతున్నారు. యాష్ అరెస్టును టీడీపీ నేతలు నారా లోకేష్, అచ్చెన్నాయుడు ఖండించారు. ఎయిర్ పోర్టులో యాష్ ను అక్రమంగా అరెస్టు చేయడం గురించి తెలిసి షాకయ్యానని పేర్కొన్నారు లోకేష్.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పే వారి నొరు నొక్కాలని చూస్తున్నారన్నారు. ఒక టెర్రరిస్టులా అతన్ని విదేశాల నుండి వచ్చీరాగానే అరెస్టు చేయడం దారుణమన్నారు. అతనికి న్యాయం జరిగే వరకూ పోరాటం ఆగదన్నారు. ప్రజా సమస్యలపై స్పందించే ఎన్ఆర్ఐలను వేధింపులకు గురి చేయడం దుర్మార్ఘమని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
ఎన్ఆర్ఐ యాష్ అరెస్టు విషయం తెలిసిన వెంటనే టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా, న్యాయవాదులు ఉమేష్ చంద్ర, గూడపాటి లక్ష్మీనారాయణ గుంటూరు సీఐడీ కార్యాలయానికి చేరుకున్నారు. సీఐడీ అధికారులతో న్యాయవాదులు మాట్లాడారు. ఈ నేపథ్యంలో యాష్ కు సీఆర్పీసీ 41 ఏ సెక్షన్ కింద సీఐడీ అధికారులు నోటీసులు అందజేశారు. జనవరి 11న విచారణకు హజరుకావాలని నోటీసులో సీఐడీ అధికారులు పేర్కొన్నారు.