Tripurantakam (Prakasam): ప్రకాశం జిల్లా త్రిపురాంతకం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన నలుగురు డిజైన్ కార్మికులు మృతి చెందారు. విజయవాడ నగరానికి చెందిన పిల్లి శ్రీను (35), చంద్రశేఖర్ (33), కే శ్రీను (22), సాయి (32) మరో ఇద్దరు శుభకార్యాల్లో అలంకరణ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో వీరు అనంతపురంలోని ఓ శుభ కార్యానికి వెళ్లి అక్కడ అలంకరణ పనులు పూర్తి చేశారు. అనంతరం తిరిగి కారులో స్వస్థలం విజయవాడకు వెళుతుండగా, ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని పౌర సరఫరాల గోడౌన్ వద్ద వీరి కారును విజయవాడ నుండి హిందూపురం వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న శ్రీను, సాయి, చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారు తీవ్రంగా గాయపడటంతో వారిని చికిత్స నిమిత్తం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో కె శ్రీను అనే యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ప్రమాదంలో గాయపడిన అశోక్, కొయ్యని రాజులు వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద ధాటికి కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. ముగ్గురి మృతదేహాలు కారులోనే ఇరుక్కుపోగా, స్థానికుల సాయంతో పోలీసులు అతికష్టం మీద మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. త్రిపురాంతకం సీఐ వెంకట సైదులు ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.