Kuppam Municipal Elections:ఎన్నికల అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎస్ఈసీకి లేఖ రాసిన గంటల వ్యవధిలోనే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ ప్రచార బాధ్యతలను పర్యవేక్షిస్తున్న మాజీ మంత్రి అమరనాధ్ రెడ్డి, చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని, టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, కుప్పం టీడీపీ ఇన్ చార్జి పిఎస్ మునిరత్నంలను మంగళవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీలో ఓ వార్డును వైసీపీ ఎకగ్రీవం చేసుకుని మొదటి షాక్ ఇచ్చింది. ఆ తర్వాత టీడీపీ నేతలపై కేసులు నమోదు చేయడం, ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న నేతలను అరెస్టు చేయడం చంద్రబాబుకు మరో షాక్ ఇచ్చినట్లు అయ్యింది.
Read More: Chandra Babu: వైసీపీ సర్కార్ పై సీరియస్ కామెంట్స్ చేసిన చంద్రబాబు..!!
Kuppam Municipal Elections: నేతల అరెస్టుపై చంద్రబాబు ఏమన్నారంటే..
టీడీపీ నేతలను అక్రమంగా అరెస్టు చేశారంటూ చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులను ఆయన ఖండించారు. టీడీపీ నేతల అరెస్టు అప్రజాస్వామికమని అన్నారు. కుప్పంలో ఓ హోటల్ లో ఉన్న అమరనాధ్ రెడ్డి, పులివర్తి నాని తదితరులను పోలీసులు అరెస్టు చేశారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని చంద్రబాబు విమర్శించారు. టీడీపీ నేతలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు. ఎన్నికలను ఏకపక్షం చేసుకోవాలని జగన్ రెడ్డి ప్రణాళిక అని చంద్రబాబు దుయ్యబట్టారు. ఎట్టిపరిస్థితుల్లో జగన్ రెడ్డి ఆటలు సాగబోవని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగేలా ఈసీ చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన టీడీపీ నేతలను విడుదల చేయాలని కోరారు.
అసలు ఏమి జరిగింది అంటే..
కుప్పం మున్సిపల్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ 14వ వార్డును ఏకగ్రీవం చేశారంటూ టీడీపీ నేతలు సోమవారం రాత్రి మున్సిపల్ కార్యాలయం వద్ద ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ నిరసన అర్ధరాత్రి వరకూ కొనసాగింది. ఈ నిరసనలో ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు, మాజీ మంత్రులు అమరనాధ్ రెడ్డి, బండారు సత్యనారాయణమూర్తి, పార్టీ పార్లమెంట్ ఇన్ చార్జి పులివర్తి నాని, ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అయితే దీనిపై మున్సిపల్ కమిషనర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతలు కార్యాలయంలో నిరసనకు దిగి తనతో పాటు సిబ్బంది విధులను ఆటంకం కలిగించారనీ, అద్దాలు పగులగొట్టారని కమిషనర్ చిట్టిబాబు ఇచ్చిన ఫిర్యాదుపై టీడీపీ నేతలు, కార్యకర్తలపై అర్బన్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 16 మందిపై ఐపీసీ 143, 147, 353, 427, రెడ్ విత్ 149 తో పాటు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు మేరకు కుప్పంలోని ఓ హోటల్ లో ఉన్న అమర్నాధ్ రెడ్డి, పులివర్తి నాని లను మంగళవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే విధంగా ఎమ్మెల్యే రామానాయుడు, కుప్పం ఇన్ చార్జి మునిరత్నం లను అదుపులోకి తీసుకున్నారు.
Kuppam Municipal Elections: 14వ వార్డు ఏకగ్రీవంపై ఎస్ఈసీకి ఫిర్యాదు
మరో పక్క కుప్పం మున్సిపాలిటీలోని 14వ వార్డు ఏకగ్రీవంపై ఎస్ఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. టీడీపీ అభ్యర్ధులు ఎం ప్రకాశ్, పి తిరుమగల్ కుప్పం లో లేకపోయినా వారు నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారని ఎస్ఈసీకి టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ఫిర్యాదు చేశారు. అభ్యర్ధుల సంతకాలతో కూడిన లేఖను ఎస్ఈసీకి పంపారు. నామినేషన్ నుండి ఉపసంహరణ తేదీ వరకూ జరిగిన పరిణామాలను అశోక్ బాబు లేఖలో పేర్కొన్నారు. అభ్యర్ధుల తరపున ఫొర్జరీ పత్రాలు ఎవరు సమర్పించారో సీసీ కెమెరా పుటేజ్ ఆధారంగా తేల్చాలని ఆయన కోరారు.